ఏపీ 4 ఇంట్రా లింకులను ఒప్పుకోం..ఎన్ డబ్ల్యూడీఏకి తేల్చి చెప్పిన తెలంగాణ

ఏపీ 4 ఇంట్రా లింకులను ఒప్పుకోం..ఎన్ డబ్ల్యూడీఏకి తేల్చి చెప్పిన తెలంగాణ
  • ఆ ఇంట్రాలింకులన్నీ గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధం
  • అయినా డీపీఆర్​లు ఇవ్వాలని ఎలా అడిగారు?
  • జీసీ లింక్​లో తరలించే 148 టీఎంసీల్లో 74 మాకు ఇవ్వాలి
  • అదనంగా 200 టీఎంసీల వినియోగానికి అనుమతులివ్వాలి
  • కృష్ణా బేసిన్​లో రెండు రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలి
  • జీసీ లింక్ కన్సల్టేషన్ మీటింగ్​లో కోరిన రాష్ట్ర అధికారులు

హైదరాబాద్, వెలుగు:  ఏపీ నిర్మించాలనుకుంటున్న మరో నాలుగు ఇంట్రా లింక్​ (రాష్ట్రం లోపల నదుల అనుసంధానం) ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. చింతలపూడి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్, బాబు జగ్జీవన్​రామ్​ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్​ఆర్​ పల్నాడు డ్రాట్​మిటిగేషన్​  ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను ఇంట్రా లింక్​కింద చేపట్టేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ కాన్సెప్ట్​ నోట్స్ సబ్​మిట్​ చేసిందని పేర్కొంది.ఆ ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్​అవార్డులు, విభజనచట్టంలోని నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.అయినా, పరిగణనలోకి తీసుకుని డీపీఆర్​లు ఇవ్వాలని ఎలా అడిగారని ప్రశ్నించింది. ఇలాంటి ప్రాజెక్టులను సెంట్రల్​వాటర్​ కమిషన్​ కూడా పరిగణనలోకి తీసుకోలేదని, కొన్ని ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో 2021లో కేంద్రం గెజిట్​ నోటిఫికేషన్​లో చేర్చించిందని గుర్తు చేసింది.

 ఈ ఇంట్రా లింక్​ ప్రాజెక్టులు కేంద్రం నేషనల్​పర్​స్పెక్టివ్​ ప్లాన్​(ఎన్​పీపీ)లో భాగంగా తీసుకున్న ఏ లింక్​లోనూ భాగం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని.. పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​లో భాగంగా 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలపైనా అన్ని ఏజెన్సీలు అభ్యంతరం తెలిపాయని, అది గోదావరి ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధమని చెప్పాయని గుర్తుచేసింది. శుక్రవారం జలసౌధలో గోదావరి కావేరి లింక్​పై నేషనల్​వాటర్​ డెవలప్​మెంట్​ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) ఆరో కన్సల్టేషన్​ మీటింగ్​ను నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రత్యక్షంగా హాజరు కాగా, ఏపీ, చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, కర్నాటక, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు వర్చువల్​గా పాల్గొన్నాయి. సమావేశానికి ఒడిశా, మధ్యప్రదేశ్​దూరంగా ఉన్నాయి. తెలంగాణ తరఫున ఇరిగేషన్​ శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ రాహుల్​బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​ పాటిల్, ఈఎన్​సీ అంజద్​హుస్సేన్, ఇంటర్​స్టేట్​ఎస్​ఈ విజయ్​ కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్​ సుబ్రహ్మణ్య ప్రసాద్​ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్​ బొజ్జా తెలంగాణ వాదనలను బలంగా వినిపించారు. గోదావరి కావేరి లింక్​కు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్నట్టు ఎన్​డబ్ల్యూడీఏకి చెప్పారు. అయితే, పలు షరతులను పెట్టారు. 

సగం వాటా ఇవ్వాలి..

గోదావరి కావేరి లింక్​లో భాగంగా తరలించే 148 టీఎంసీల జలాల్లో సగం వాటా (74 టీఎంసీలు) ఇవ్వాలని రాహుల్​ బొజ్జా డిమాండ్​ చేశారు. జీసీ లింక్​ను తెలంగాణ భూభాగం నుంచే చేపడుతున్నా.. కేవలం 45 టీఎంసీలే కేటాయించారని అన్నారు. కాబట్టి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని సగం వాటా ఇవ్వాలని కోరారు. అయితే, రాష్ట్ర విజ్ఞప్తిని ఎన్​డబ్ల్యూడీఏ తిరస్కరించింది. సగం వాటా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా, ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్​ను చేపడితే.. పలు షరతులతో చేపట్టాలని రాహుల్​బొజ్జా ఎన్​డబ్ల్యూడీఏ చైర్మన్​కు సూచించారు. తొలుత తమకు గోదావరిలో కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాలన్నారు. 148 టీఎంసీల తరలింపునకు చత్తీస్​గఢ్​ నుంచి నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​తీసుకోవాలన్నారు. జీసీ లింక్​తో దేవాదుల లిఫ్ట్​లో 38.16 టీఎంసీలు, సమ్మక్కసాగర్​లో 46.96 టీఎంసీలు, సీతమ్మసాగర్​– సీతారామ లిఫ్ట్​ ప్రాజెక్టుల్లో 67.05 టీఎంసీలు కలిపి 152.17 టీఎంసీల నీటి వినియోగానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలని, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే సమ్మక్కసాగర్​ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా చూడాలని, అందుకు అనుగుణంగా గేట్​ ఆపరేషన్​ ప్రొటోకాల్​ షెడ్యూల్​పై సిమ్యులేషన్​ స్టడీస్​ చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి జీసీ లింక్​లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి వాడుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. 

ఎక్కడైనా వాడుకుంటం..

తెలంగాణ కోటా కింద ఇచ్చే నీళ్లను శ్రీరాంసాగర్​ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు వాడుకోవాలన్న రూల్స్​ను ఎన్​డబ్ల్యూడీఏ పెడుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర సర్కారు అందుకు అంగీకరించలేదు. ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా తమకు స్వేచ్ఛనివ్వాలని రాహుల్​బొజ్జా స్పష్టం చేశారు. జీసీ లింక్​లో భాగంగా కృష్ణా బేసిన్​లో అవసరమున్న చోట రెండు రిజర్వాయర్లను కట్టివ్వాలని, ఆయా రిజర్వాయర్లకు నీటి తరలింపు వ్యవస్థలను నిర్మించాలని కోరారు. జీసీ లింక్​లో భాగంగా సాగర్​కు నీటిని తరలించే కన్వేయర్​ సిస్టమ్​లో చాలా వరకు వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ ముంపును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

 తరలించే నీటిని నేరుగా నాగార్జునసాగర్​ ప్రాజెక్టులోకి తీసుకెళ్లవద్దని, సాగర్​ టెయిల్​పాండ్​కు తరలించి అక్కడి నుంచి తీసుకెళ్లాలని సూచించారు. సాగర్​లోకి నీటిని తరలిస్తున్నందున అక్కడ రీప్లేస్​మెంట్​కు బదులుగా కర్నాటకకు ఆల్మట్టిలో అదనంగా 16 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దాని వల్ల తెలంగాణకు గేట్​వే ప్రాజెక్ట్​ అయిన జూరాలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్​ నుంచి రీప్లేస్​మెంట్​అన్నారే తప్ప ఎలా అనే వివరాలను మాత్రం చెప్పలేదన్నారు. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించాలన్నారు. అన్ని రాష్ట్రాలూ సమ్మతించాకనే మెమోరాండమ్​ఆఫ్​ అగ్రిమెంట్​పై ముందుకు వెళ్లాలని, ఇప్పుడే చేస్తే అది తొందరపాటే అవుతుందని స్పష్టం చేశారు.  

అవి గోదావరి నీళ్లు కాదు..హిమాలయ జలాలు: ఎన్​డబ్ల్యూడీఏ

గోదావరి కావేరి లింక్​లో తరలిస్తున్న నీళ్లు గోదావరి జలాలు కాదని ఎన్​డబ్ల్యూడీఏ చైర్మన్​ స్పష్టం చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా హిమాలయ పర్వతాల్లోని నదుల నీటిని ఇక్కడకు తీసుకొస్తామని చెప్పారు. అయితే, ఫేజ్​ 1లో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి గోదావరి నీళ్లను తీసుకెళ్తామని, భవిష్యత్​లో ఇంటర్​ లింకింగ్​ ద్వారా హిమాలయ జలాలను ఇక్కడకు తీసుకొస్తామని పేర్కొన్నారు. చత్తీస్​గఢ్​ అభ్యంతరాలనూ ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చత్తీస్​గఢ్​ నీళ్లను ముట్టుకోబోమన్నారు. అయితే, బోధ్​ఘాట్​ ప్రాజెక్టును నిర్మించేందుకు కనీసం 15 ఏండ్లైనా పడుతుందని, అప్పటి వరకు జీసీ లింక్​లో తాత్కాలికంగా మాత్రమే చత్తీస్​గఢ్​ నీటిని వాడుకుంటామని స్పష్టం చేశారు. చత్తీస్​గఢ్​ బోధ్​ఘాట్​ ప్రాజెక్టును పూర్తి చేస్తే.. జీసీ లింక్​ను మూసేస్తామన్నారు. అప్పుడు హిమాలయాల నుంచి నీటిని ఇచ్చంపల్లి వరకు తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిలో ఒక్క చుక్క కూడా వాడుకోబోమని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ పెద్దమనసు చేసుకుని ప్రస్తుతానికి జీసీ లింక్​కు సమ్మతం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ఇచ్చంపల్లి ఓకే అయినా పోలవరం నుంచే చేపట్టాలి: ఏపీ

చత్తీస్​గఢ్​ వినియోగించుకోని నీటిపై అభ్యంతరాలున్నాయని, వాడుకోని ఆ వాటా నీటిపై ఆ రాష్ట్రం ఇంకా అంగీకారం తెలుపలేదని ఏపీ పేర్కొంది. 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్తే తమ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని వాదించింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించినా.. పోలవరం నుంచే గోదావరి కావేరి లింక్​ను చేపట్టాలని తెలిపింది. వాస్తవానికి సాగర్, సోమశిల ప్రాజెక్టుల్లో క్యారీ ఓవర్​ స్టోరేజీ ఉందని, ఆ వాటాలు తేల్చాలని పేర్కొంది. కృష్ణా బేసిన్​లోకి నీటిని తీసుకొస్తారు కాబట్టి.. ఇతర రాష్ట్రాలూ వాటా అడిగే అవకాశం ఉందని పేర్కొంది.  కాబట్టి, అక్కడి నుంచి నీటి తరలింపు అంత సులువు కాదని వాదించింది. తుంగభద్ర బేసిన్​లోని కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని పేర్కొంది. ఇటు నీటి లభ్యతపైనా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపింది.  

మేం ప్రాజెక్ట్​ కడితే నీళ్లు ఎక్కడుంటయ్​?: చత్తీస్​గఢ్​

జీసీ లింక్​పై చత్తీస్​గఢ్​ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రం వాడుకోని నీళ్ల ఆధారంగానే లింక్​ చేపడుతున్నందున.. నీటి వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. తమకు 301 టీఎంసీల వాటా ఉన్నదని, అందులో ఇప్పటికే 164 టీఎంసీల వినియోగం ఉందని పేర్కొంది. మిగిలింది 137 టీఎంసీలని పేర్కొంది. అందులోనూ వంద టీఎంసీలతో బోధ్​ఘాట్​ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు నీటి లభ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించింది. అలాగే, పరీవాహక ప్రాంతం ఆధారంగా తమకు 45 టీఎంసీల నీళ్లివ్వాలని కర్నాటక డిమాండ్​ చేసింది. కనీసం 40 టీఎంసీలైనా కేటాయించాలని కోరింది. కాగా, గోదావరి అత్యధిక భాగం మహారాష్ట్రలోనే ప్రవహిస్తున్నదని, 45 శాతం పరీవాహక ప్రాంతం ఇక్కడే ఉందని ఆ రాష్ట్రం పేర్కొంది. అలాంటి తమకు ఒక్క చుక్క కూడా నీళ్లు ఇవ్వకుండా బయటకూర్చోబెట్టేశారని ఆక్షేపించింది. జీసీ లింక్​లో నీళ్లు ఇవ్వకపోయినా.. తమకు కొన్ని ఇంట్రా లింక్స్​ఉన్నాయని, వాటిని జీసీ లింక్​లో భాగంగా నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేసింది.