న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025లో ప్రవాసుల హక్కులు రక్షించేలా చూడాలని తెలంగాణ ఎంపీలను రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ విజ్ఞప్తి చేసింది. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ఈ బిల్లు ప్రభావితం చేయనుందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులను.. కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు భేటీ అయ్యారు.
అలాగే, తెలంగాణ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, కేఆర్ సురేశ్ రెడ్డి ఇతరులను శనివారం ఢిల్లీలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకునేలా కేంద్రానికి సూచనలు చేయాలని కోరారు. ప్రధానంగా తెలంగాణ నుంచి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లే కార్మికులపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపనుందని, దీంతో రాష్ట్ర ఎంపీలు ఈ అంశంపై ఫోకస్ పెట్టాలని కోరారు.
