
- 45 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని సర్కార్ ఆదేశం
- అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్స్
- పత్రికల కథనాలు, ప్రజల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు
- అధికారులు, బాధితులను విచారించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల కబ్జాపై సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, భూదాన్, దేవాదాయ, వక్ఫ్ భూములు ఎన్ని? వాటిల్లో ఎన్ని కబ్జాలకు గురయ్యాయి? అనేది తేల్చాలని చెప్పింది. సర్కార్ భూములను ఆక్రమించి, వాటిని అమ్ముకుంటున్నోళ్లకు ఆఫీసర్లే సహకరిస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా చట్టంలోని లొసగులతో సబ్రిజిస్ట్రార్ఆఫీసులు కేంద్రంగానే ప్రభుత్వ భూములను ప్రైవేట్పరం చేస్తున్న విషయాన్ని తాజాగా ‘వెలుగు’ పేపర్ ఉదాహరణలతో సహా బయటపెట్టింది.
దీనికితోడు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి.. 45 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలు..
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ, భూదాన్, దేవాదాయ, వక్ఫ్భూములను ఆక్రమించడం.. వాటిల్లో వెంచర్లు వేసి గజాలు, గుంటల చొప్పున అమ్ముతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. శంషాబాద్లో వేల కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు.. ఏకంగా నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించారు. ఫోర్జరీ ఉత్తర్వులతో అటు న్యాయవ్యవస్థను, ఇటు రిజిస్ట్రేషన్ విభాగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
అయితే హైకోర్టు అదంతా గుర్తించి, విలువైన భూమిని కాపాడింది. ఇక కరీంనగర్ శివారులోనూ రూ.100 కోట్ల విలువైన 20 ఎకరాల సీలింగ్ల్యాండ్ను అక్రమార్కులు ప్లాట్లుగా మార్చి 476 మందికి అమ్మారు. అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్లు చేయించారు. అయితే ఆ అక్రమ రిజిస్ట్రేషన్లను కలెక్టర్ తాజాగా రద్దు చేశారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి.
హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువ..
బీఆర్ఎస్సర్కార్ హయాంలో ధరణి పోర్టల్తెచ్చాక లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చేసినట్లు ప్రస్తుత కాంగ్రెస్సర్కార్ గుర్తించింది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ తరహా బాగోతాలు ఎక్కువగా జరిగినట్టు తేల్చింది. పాత రికార్డులన్నీ మాయం చేయడంతో వీటిని ఫోరెన్సిక్ఆడిట్ద్వారా గుర్తించే పనిలో సర్కార్ తలమునకలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృషించిన భూదాన్ భూముల స్కామ్లో ఐఏఎస్అమోయ్కుమార్, ఇతర అధికారుల పాత్రపై అటు ఏసీబీతో పాటు ఇటు ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ ఎంక్వైరీ లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశర్వరం, మేడ్చల్, గచ్చిబౌలి, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా భూఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల అటవీ భూములకు గాను 47 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. మరో 6 లక్షల ఎకరాలు జాడలేదు. అటు తెలంగాణ స్టేట్ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు చెందిన వేలాది ఎకరాల భూములు మాయమయ్యాయి. టీజీఐఐసీ దగ్గర మొత్తం 60 వేల ఎకరాల భూములు ఉండగా, వాటిల్లో 25 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదయ్యాయి. వక్ఫ్తో పాటు దేవాదాయ భూములకు సంబంధించి దాదాపు 40 శాతం భూములు ధరణిలోకి ఎక్కలేదు. దాదాపు 90 వేల ఎకరాల ఎండోమెంట్భూములకు గాను కేవలం 50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయినట్లు గుర్తించారు. ఈ భూములన్నీ ఎక్కడికి వెళ్లాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
విచారణ స్టార్ట్..
సర్కార్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు బుధవారమే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రధానంగా సీసీఎల్ఏ సహా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి సహా కరీంనగర్ తదితర జిల్లాల్లో రికార్డులను పరిశీలించనుంది. ప్రభుత్వ భూముల రికార్డులకు, వాస్తవంగా ఉన్న భూములకు మధ్య తేడా ఎంత ఉంది? ఎక్కడెక్కడ భూములు కబ్జాలకు గురయ్యాయి? అనేది తేల్చనుంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో గతంలో పనిచేసిన కలెక్టర్లు, తహసీల్దార్లు, సబ్రిజిస్ట్రార్లను, బాధితులను పిలిపించి ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.