మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజ్​

మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజ్​
  • 2020లో ఎల్​ఆర్​ఎస్​కు అప్లయ్​ చేసుకున్నోళ్లకు ప్రయోజనం
  • మొత్తం 25.44 లక్షల అప్లికేషన్లు.. 
  • క్లియర్​ చేయాలని సీఎం రేవంత్​ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: లేఅవుట్​ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్​ఆర్​ఎస్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో తీసుకున్న దరఖాస్తులకు సంబంధించిన లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

వాణిజ్య ప‌‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌‌న్లు, ర‌‌వాణా, గ‌‌నులు, భూగ‌‌ర్భ వ‌‌నరుల శాఖ ప‌‌న్ను వ‌‌సూళ్లపై  సెక్రటేరియెట్​లో  సోమవారం సీఎం సమీక్షించారు. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్లను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. 

2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్​కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని అప్పట్లో సమర్పించారు.  

పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేండ్లుగా నిరీక్షిస్తున్నాయి. వివిధ కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమవారం సెక్రటేరియెట్​లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

అప్పటి నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారి సొంతమవుతాయి. దీంతో నిర్మాణాలకు అనుమతులు లభించటంతో పాటు, బ్యాంకు రుణాలు పొందేందుకు, స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోతాయి.