వడ్ల కమీషన్ వచ్చేసింది.. యాదాద్రి జిల్లాలో 2023-24కు సంబంధించి రెండు సీజన్లకు చెల్లింపు

వడ్ల కమీషన్ వచ్చేసింది.. యాదాద్రి జిల్లాలో 2023-24కు సంబంధించి రెండు సీజన్లకు చెల్లింపు
  • గతంలో రూ.12.67 కోట్లు
  • తాజాగా రూ.5.66 కోట్లు రిలీజ్​ చేసిన ప్రభుత్వం

యాదాద్రి, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలులో కీలకపాత్ర పోషిస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్​పీవోలకు కమీషన్ రిలీజ్​అయింది. 2023-–24 ఫైనాన్షియల్​ఇయర్​లో యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి పెండింగ్​లో ఉన్న కమీషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా సంఘాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్​ వచ్చింది. 

దళారుల ప్రమేయం లేకుండా..

వడ్ల కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రతీ సీజన్​లో వందలాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్, ఫార్మర్​ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్​పీవోలు), మార్కెట్​ కమిటీలు ధాన్యం  కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఇదివరకు ఎక్కువగా పీఏసీఎస్​ల పాత్ర కీలకంగా ఉండగా.. 2025 వానాకాలం సీజన్ నుంచి మహిళా సంఘాల నేతృత్వంలో నడిచే ఐకేపీ సెంటర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 50 శాతానికి పైగా కొనుగోళ్లు ఐకేపీ సెంటర్లలోనే జరుగుతున్నాయి. మిగతా వడ్లను పీఏసీఎస్​, ఎఫ్​పీవో, మార్కెట్​కమిటీల ఆధ్వర్యంలో కొంటున్నారు.  

కమీషన్​ మొత్తం రూ.18.34 కోట్లు

వడ్లు కొనుగోలు చేస్తున్న ఆయా సంఘాలకు క్వింటాల్​కు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తోంది. ఇలా ప్రతీ సీజన్​లో వాటికి రూ.కోట్లలో కమీషన్​ అందుతోంది. దీంతో మహిళా సంఘాలు, పీఏసీఎస్​లు, ఎఫ్​పీవోలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2023–-24 వానాకాలం, యాసంగిలో 5.73 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్లలో ఆయా సంఘాలు కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించి రూ. 18,34,32,370 కమీషన్ వచ్చింది. 

6 నెలల కింద మొదటి విడత..

ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్​పీవోలకు గతేడాదికి సంబంధించిన కమీషన్ ​మొత్తం రూ.18.34 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం 6 నెలల కింద మొదటి విడతగా రూ. 12,67,47,000 రిలీజ్ చేసింది. తాజాగా మిగతా రూ.5,66,85,370 కమీషన్​చెల్లించింది.