విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా?

విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా?

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దాంతో యాజమాన్యాలు పాఠశాలలను తెరిచేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. కాగా.. థర్డ్ వేవ్ ముప్పు రాబోతోందనే వార్తలతో.. స్కూల్స్‌ ఓపెన్ చేయోద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. దాంతో అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు సమాధానంగా.. ‘రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తాం. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగుతుంది. విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి’ అని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా కోర్టుకు తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని కోర్టు అభిప్రాయపడటంతో.. హైకోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని న్యాయమూర్తికి తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు విద్యా శాఖను ఆదేశించింది.