- డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలను అరికట్టడంతో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్గా నిలిచారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్ బ్యూరో (ఈగల్) ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డీఎస్పీలకు శనివారం డీజీపీ దిశానిర్దేశం చేశారు. పోలీసింగ్ ఎలా పనిచేయాలో వివరించారు.
1990 నుంచి నేటి వరకు దాదాపు 3 దశాబ్దాలుగా వచ్చిన మార్పులను ప్రొబేషనరీ డీఎస్పీలకు వివరించారు. పోలీసు అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించే సేవకులుగా మారారని చెప్పారు. కొత్త చట్టాలు, దేశంలో మారుతున్న నేరాల ట్రెండ్స్కు అనుగుణంగా ఫోరెన్సిక్ సైన్స్, టెక్నాలజీ, సైబర్ చట్టాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్ మెంట్ చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే ‘సైబర్ బీట్’ గా పనిచేయాలని సూచించారు.
