- కర్నాటక గ్యారంటీస్ ఫార్ములాతో జనంలోకి కాంగ్రెస్
- ఇంటింటికీ ఆరు గ్యారంటీల కార్డు పంపిణీ
- అక్కడ అమలు చేయలేదంటున్న బీఆర్ఎస్, బీజేపీ
- మూడు పార్టీల ప్రచారంలోనూ కర్నాటక నేతల జోరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారి కర్నాటక చుట్టూ తిరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్రాన్నే సెంట్రిక్గా చేసుకుని జనంలోకి వెళ్తున్నాయి. ఏకంగా కర్నాటక లీడర్లను ఇక్కడికి రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పొరుగున ఉన్న రాష్ట్రం కావటం.. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు అక్కడి ఎన్నికల్లో ప్రచారం చేపట్టడంతో అక్కడి ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణకు సోకినట్లయింది.
అప్పటివరకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించడంతో రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. అప్పటివరకు జోరు మీదున్న బీజేపీలో సంస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్ తమను అధికారంలోకి తెచ్చాయంటున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. మరో గ్యారంటీని అదనంగా జోడించి..ఆరు గ్యారంటీ లతో ఇక్కడ ప్రచారం సాగిస్తున్నది. ఫైవ్ గ్యారంటీస్ అమలుపై కర్నాటక లీడర్లను తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు చెప్పిస్తున్నది. ఇక.. కర్నాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేకపోతున్నదనే బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎదురుదాడి
కర్నాటక మోడల్ను ఫెయిల్యూర్ మోడల్ అని బీఆర్ఎస్ తన ప్రచారంలో పదే పదే చెప్తూ వస్తున్నది. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ఇదే అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్నాటకలో ఐదుగంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారని, ఇక్కడ ఐదు గంటల కరెంట్ కావాల్నో.. 24 గంటల కరెంట్ కావాల్నో తేల్చుకోవాలంటూ ప్రతి సభలోనూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేగాకుండా కర్నాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ అక్కడి రైతులను బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి తీసుకొస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కొడంగల్లో ఇటీవల మంత్రి కేటీఆర్ నిర్వహించిన సభకూ కర్నాటక నుంచి రైతులను తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ అక్కడి రైతులు.. రాష్ట్రంలో ఈ నెల 22న హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద దీక్ష చేసేందుకు ఈసీని అనుమతి కోరారు.
ఆ రైతులను కూడా బీఆర్ఎస్ వాళ్లే తీసుకొచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన జేడీఎస్ నేత కుమారస్వామి రెండు రోజుల కింద సడన్గా తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటరయ్యారు. తెలంగాణ ప్రజలనుద్దేశించి కర్నాటక వేదికగా కర్నాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుమారస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ పెట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. అంతేగాకుండా కుమారస్వామి ప్రెస్మీట్ను రాష్ట్రంలో లైవ్ కవరేజీ ఇచ్చేలా అన్ని చానెళ్లకు మంత్రి హరీశ్ రావు ద్వారా సందేశాలు వెళ్లాయని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలకే గతి లేదు..
తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని కుమార స్వామి తన ప్రెస్మీట్లో కామెంట్స్ చేశారు. సామాన్యులపై కరెంట్ భారాన్ని కాంగ్రెస్ సర్కారు మోపిందని ఆయన అన్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ రాసిచ్చిన స్క్రిప్టేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
కర్నాటక పరిస్థితి దిగజారిందంటున్న బీజేపీ
కర్నాటకలో ఓటమి తర్వాత తెలంగాణలోనూ బీజేపీపై ఎఫెక్ట్ పడింది. కర్నాటకలో అధికారం చేజారిపోవడం.. ఆ తర్వాత ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటిదాకా ఉన్న బీజేపీ హవా తగ్గింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం.. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వచ్చేస్తుండడంతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. అయితే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు కర్నాటకది ఫెయిల్యూర్ మోడల్ అని బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఐదు గ్యారంటీల అమలు మాట దేవుడెరుగు.. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నాటకలో ఐదు నెలల్లోనే ఐదేండ్ల నష్టం జరిగిందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. అంతేగాకుండా కర్నాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్యారంటీలను నమ్మి ఓటేసినందుకు కర్నాటక మహిళలు మోసపోయారని, ఆర్డినరీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం అందిస్తున్నారని పేర్కొన్నారు. అసలు అక్కడి ప్రభుత్వం ఇంకో ఆరు నెలలైనా ఉంటుందన్న గ్యారంటీ లేదని కామెంట్లు చేశారు.
గ్యారంటీస్తో కాంగ్రెస్ ముందుకు
ఆరు గ్యారంటీల కార్డునే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రధాన ఆయుధంగా నమ్ముకుంది. వంద రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నది. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి స్కీములను ప్రకటించింది. కర్నాటక తరహాలోనే ఆ గ్యారంటీ కార్డులను ఇంటింటికీ కాంగ్రెస్ నేతలు పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడుగా కర్నాటక లో కాంగ్రెస్ ముఖ్య నేతలను రాష్ట్రంలో ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు.
వచ్చే వారం నిర్వహించనున్న గౌడ సమావేశానికి మరోసారి సిద్ధరామయ్య హాజరుకానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా కర్నాటక వ్యక్తి కావడంతో.. రెండు రకాలుగా పార్టీకి ఆయన సేవలు కలిసొస్తున్నాయి. ఖర్గేతో దాదాపు ఆరేడు సభలను ఇక్కడ కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. వారితో పాటు కర్నాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, మైనారిటీ లీడర్లను తీసుకొచ్చి కర్నాటకలో ఏం చేస్తున్నారో చెప్పిస్తున్నారు. హామీల అమలును ప్రజలకు వివరిస్తున్నారు. మంగళవారం కర్నాటక మంత్రి దినేశ్ గుండూరావు, కర్నాటక ఎమ్మెల్యే దేవేంద్రప్ప రాష్ట్రానికి వచ్చారు. మంత్రి దినేశ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడగా.. ఎమ్మెల్యే దేవేంద్రప్ప చెన్నూరులో వివేక్ వెంకటస్వామి తరఫున ప్రచారం చేశారు. కర్నాటకలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.