
- పదేండ్ల తర్వాత 9.97 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు
- మొత్తం 99.97లక్షల కార్డులతో 3.21 కోట్ల మందికి లబ్ధి
- 1.68 లక్షల టన్నుల నుంచి 1.92 లక్షల టన్నులకు పెరిగిన నెల రేషన్ కోటా
- సెప్టెంబర్ రేషన్ పంపిణీకి సివిల్ సప్లయ్ శాఖ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో రేషన్కోటా భారీగా పెరగనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు పెద్ద ఎత్తున మంజూరు చేయడంతో కొత్తగా భారీ సంఖ్యలో రేషన్లబ్ధిదారులు జాబితాలో చేరారు. ఫలితంగా సెప్టెంబర్ నెల రేషన్ లో సన్న బియ్యం కోటా గణనీయంగా పెరగనుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. రేవంత్ సర్కారు..రేషన్పంపిణీలో దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేసి కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు రేషన్పంపిణీలోనూ సరికొత్త రికార్డులు సృష్టించనుంది.
39.60 లక్షల మందికి లబ్ధి
గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల 95వేల 282 రేషన్ కార్డులు ఉండగా.. 2 కోట్ల 81 లక్షల 47 వేల 565 మంది లబ్ధిదారులు ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అప్లై చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కొత్తగా 9 లక్షల 97 వేల 650 కార్డులను మంజూరు చేసింది. ఈ కార్డులకుగానూ 26 లక్షల 73 వేల 702 మంది లబ్ధిదారులు కొత్తకార్డుల్లో లబ్ధిదారులయ్యారు. పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడానికి అనుమతించగా మరో 12 లక్షల 86 వేల 457 మంది కుటుంబ సభ్యులను చేర్చారు. దీంతో కొత్తగా 39 లక్షల 60 వేల 159 మంది లబ్ధిదారులకు అదనంగా అవకాశం దక్కింది. ఫలితంగా రాష్ట్రంలో రేషన్కార్డులు సంఖ్య 99 లక్షల 92 వేల 932కు పెరిగాయి. రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 7 వేల 724 మందికి చేరింది.
రేషన్ పంపిణీలో రికార్డ్!
రాష్ట్రంలో ఈ సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో రేషన్పంపిణీకి సర్కారు సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్రంలో ఉన్న 89.92 లక్షల రేషన్ కార్డులకుగానూ 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేశారు. నెలలో రేషన్ సరఫరాకు లక్షా 68 వేల 885 టన్నుల బియ్యం సరఫరా చేశారు. తాజాగా 3.21 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. దీంతో తాజా లబ్ధిదారులకు అనుగుణంగా లక్షా 92 వేల టన్నుల సన్నబియ్యం సరఫరాకు సిద్ధమైంది. అంటే గతంలో కంటే ఈ సెప్టెంబర్ నెలలోనే 23 వేల 760 టన్నుల సన్న బియ్యం రేషన్ ద్వారా అందనుంది.
రేషన్ కార్డులు, లబ్ధిదారుల వివరాలు రేషన్
కార్డులు లబ్దిదారులు నెలకోటా టన్నుల్లో
నేడు 99.97 లక్షలు 3.21 కోట్లు 1.92 లక్షలు
గతంలో 83.92 లక్షలు 2.81 కోట్లు 1.68 లక్షలు
పెరిగింది 9.97 లక్షలు 39.60 లక్షలు 23760 టన్నులు