టెన్త్ క్వశ్చన్ పేపర్ వంద మార్కులకు!.. పార్ట్ 1లో 75 మార్కులు.. పార్ట్ 2లో 25 మార్కులు

టెన్త్ క్వశ్చన్ పేపర్ వంద మార్కులకు!.. పార్ట్ 1లో 75 మార్కులు.. పార్ట్ 2లో 25 మార్కులు

 

  • ఒకే క్వశ్చన్ లో పార్ట్ 1,2  ప్రశ్నలు పెట్టే యోచన
  • కసరత్తు చేస్తున్న ఎస్​సీఈఆర్టీ అధికారులు 
  • టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయాల సేకరణకు రెడీ


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్ మారబోతున్నది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షలు వంద మార్కులకు నిర్వహించనున్నారు. దీంతో కొత్త ప్రశ్నాపత్రాన్ని రూపొందించే పనిలో ఎస్​సీఈఆర్టీ పడింది. వచ్చే నెల ఒకటో తేదీ వరకూ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరం వరకూ టెన్త్ లో 80 మార్కులతో పరీక్ష, 20 ఇంటర్నల్ మార్కులు ఉండేవి. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి  ఇంటర్నల్ మార్కులను ఎత్తేయ్యాలని ప్రభుత్వం గతేడాదే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వంద మార్కులతో పరీక్ష జరగనున్నది. ఇందుకోసం క్వశ్చన్ పేపర్ ను రూపొందించే పనిలో అధికారులున్నారు. దీని కోసం ఇటీవలే సబ్జెక్టు ఎక్స్ పర్ట్​లతో ఎస్​సీఈఆర్టీ అధికారులు సమావేశమయ్యారు. పార్ట్1లో 75 మార్కులు, పార్ట్2లో 25 మార్కులతో పేపర్ రూపొందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్ట్1 క్వశ్చన్ పేపర్ ను ముందుగా విద్యార్థులకు అందించి, పార్ట్ 2 క్వశ్చన్ పేపర్​ను చివరి అరగంట సమయంలో స్టూడెంట్లకు ఇచ్చేవారు. ప్రస్తుతం పార్ట్ 1, పార్ట్ 2 పేపర్లను వేర్వేరుగా అందిస్తున్నారు. దీంతో ఆన్సర్ బుక్ లెట్ కు పార్ట్ 2ను జత చేసే వారు. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు పార్ట్ లను కలిపి ఒకే పేపర్ రూపంలో ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిద్వారా దీంతో విద్యార్థులు వారికి నచ్చిన క్వశ్చన్లు ముందుగా రాసుకునే అవకాశ ఉంటుందని యోచిస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం ఫిజిక్స్, బయాలజీ వేర్వేరు క్వశ్చన్ పేపర్లను 50 మార్కుల చొప్పున రూపొందిస్తున్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 50 మార్కులతో పాటు వంద మార్కుల పేపర్​నూ మోడల్​గా రూపొందించాలని యోచిస్తున్నారు. సర్కారు నిర్ణయానికి అనుగుణంగా ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారు.

అభిప్రాయ సేకరణ

టెన్త్ క్వశ్చన్ మోడల్ పేపర్, బ్లూ ప్రింట్ ను రెండు, మూడు రోజుల్లోనే ఎస్​సీఈఆర్టీ వెబ్ సైట్​లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంట్లో మార్పులు చేర్పుల కోసం టీచర్లు, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. పార్ట్ 1,2  మార్కులు, ఒకే క్వశ్చన్ పేపర్.. తదితర అంశాలపై వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అభిప్రాయాల సేకరణ పూర్తయిన తర్వాత.. ప్రభుత్వానికి ఎస్​సీఈఆర్టీ అధికారులు ప్రతిపాదనలు పంపించనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏటా ఐదు లక్షలకు పైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలకు అటెండ్ అవుతున్నారు.