
హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ వివరాలతో మార్కులు చూసుకునేలా బోర్డు వెబ్సైట్లో ఆప్షన్ ఇచ్చింది. మార్కులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గంటల్లోపు తెలపాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుందన్నారు.
గత సర్కార్ 2022 డిసెంబర్లో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్లో రాత పరీక్షను నిర్వహించగా, సుమారు 40 వేల మంది అటెండ్ అయ్యారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న మిగిలిన 1,890 స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు చేరింది. ఆబ్జక్షన్ల పరిశీలన అనంతరం ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని బోర్డు పేర్కొంది.