కల్తీ కల్లు నియంత్రణపై కదిలిన యంత్రాంగం..రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్ స్పెషల్​ ఆపరేషన్​ షురూ

కల్తీ కల్లు నియంత్రణపై  కదిలిన యంత్రాంగం..రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్  స్పెషల్​ ఆపరేషన్​ షురూ
  • రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్  స్పెషల్​ ఆపరేషన్​ షురూ
  • కల్తీ కల్లు ఘటనలు, మృతుల వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు
  • గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి అండదండలున్నట్లు ఆరోపణలు
  • లింక్​ ఛేదించే క్రమంలో పలువురిపై కేసులు

మహబూబ్​నగర్, వెలుగు: కల్తీ కల్లును అరికట్టడానికి తెలంగాణ స్టేట్​ యాంటీ నార్కొటిక్స్​ బ్యూరో (టీఎస్​ న్యాబ్​) రంగంలోకి దిగింది. కల్తీ కల్లు ఘటనలు జరిగిన జిల్లాలపై ఫోకస్​ పెట్టింది. ఇటీవల జరిగిన కల్తీ కల్లు ఘటనలు, తాగి చనిపోయిన వారి డేటా సేకరిస్తోంది. అలాగే ఆ కేసుల ఆధారంగా కల్తీ కల్లు తయారీకి వాడే అల్ర్ఫాజోలం లింక్​ చైన్​ను ట్రేస్​ చేస్తోంది. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కల్తీ కల్లుకు ఓ ప్రజా ప్రతినిధి అండదండలున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేసేందుకు టీఎస్​ న్యాబ్​ రెడీ అవుతున్నట్లు సమాచారం.

రెండు రోజులుగా అరెస్టులు, కేసులు..

ఐదు రోజులుగా టీఎస్​ న్యాబ్​ టీమ్​ జిల్లాల్లో పర్యటిస్తోంది. అల్ర్ఫాజోలం చైన్​ లింక్​ను ట్రేస్​ చేసి కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే మేడ్చల్​ జిల్లా సూరారంలో తనిఖీలు నిర్వహించి నరేందర్​, సతీశ్​అనే సప్లయర్ల నుంచి 10 కిలోల అల్ర్ఫాజోలంను స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో లింగయ్య​పై కేసు నమోదైంది. ఆయన రాష్ట్రంలో అల్ర్ఫాజోలంను సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈయన నెట్​వర్క్​లోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఎక్సైజ్​ కానిస్టేబుల్​పై కూడా కేసు నమోదైంది. 

ఇదే జిల్లాకు చెందిన మరో ఆరుగురు ముస్తేదారులను టీఎస్​ న్యాబ్​ అరెస్ట్​ చేసింది. మెదక్ పట్టణంలో కారులో తరలిస్తున్న నాలుగు కిలోల అల్ర్ఫాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా మామిద్గికి చెందిన చిన్నషేరి శంకర్, సంజీవ్ రావ్ పేటకు చెందిన తద్కల్ సాయిబాబా, కామారెడ్డి జిల్లా రామేశ్వర్​పల్లికి చెందిన లింగాల రాజ, తాండూర్​కు చెందిన భూమా విఠల్,  సికింద్రాబాద్​లోని మెట్టుగూడకు చెందిన సందిల్ల కృష్ణ అలియాస్ కిరణ్​లను అరెస్ట్ చేశారు. 

అయితే కల్తీ కల్లు  ఎక్కువగా అమ్మకాలు జరిగే మహబూబ్​నగర్​ జిల్లాపై టీఎస్​ న్యాబ్​ ఆఫీసర్లు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో జరిగిన ఘటనలు, కేసులు, అల్ర్పాజోలం ఎక్కడి నుంచి వస్తుందనే వ్యవహారంలో కీలక విషయాలు తెలుసుకున్నట్లు తెలిసింది.

ఏప్రిల్​లో పాలమూరులో హైడ్రామా..

ఈ ఏడాది ఏప్రిల్​లో మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కల్తీ కల్లుపై హైడ్రామా నడిచింది. మోతాదుకు మించి కల్లులో అల్ర్ఫాజోలం కలపడంతో ఏప్రిల్​ 7న కల్తీ కల్లు బాధితులు ఒక్కొక్కరుగా మహబూబ్​నగర్​ జనరల్​ హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యారు. వారం రోజుల్లో దాదాపు 40 మంది అడ్మిట్​ అయ్యారు. వీరిలో 10న ఒకరు, 12న ఇద్దరు చనిపోవడంతో ఇష్యూ సీరియస్​ అయ్యింది. దీన్ని డైవర్ట్​ చేసే ప్లాన్ నడిచినట్లు అప్పట్లో  ఆరోపణలు వచ్చాయి. మృతులు కల్తీకల్లు తాగి చనిపోలేదని, డ్రీహైడేషన్​ వల్ల చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మహబూబ్​నగర్​కు చెందిన అప్పటి ఓ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఇష్యూలో ఆఫీసర్లకు సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారనే టాక్​ వచ్చింది. 

‘ఇలాంటి ఇష్యూస్​ కూడా మేనేజ్​ చేసుకోలేరా?’ అంటూ గరం అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డాక్టర్లతో హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన వారంతా కల్తీకల్లు తాగడం వల్ల అడ్మిట్​ కాలేదని, ఎండలకు తిరగడం వల్ల డీహైడ్రేషన్​కు గురయ్యారని ప్రకటన ఇప్పించినట్లు విమర్శలొచ్చాయి. అదే రోజు ఎక్సైజ్,​ పోలీసులు ప్రెస్​మీట్  పెట్టి జిల్లాలో కల్తీకల్లు బాధితులు లేరని, హాస్పిటల్​లో ఉన్న వారంతా డీహైడ్రేషన్​కు గురైన వారని పేర్కొన్నారు. జిల్లాలో స్వచ్ఛమైన కల్లు మాత్రమే దొరుకుతుందని అప్పట్లో ప్రకటన ఇప్పించడం గమనార్హం.

కర్నాటక నుంచి దిగుమతి..

మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి కర్నాటకకు చెందిన ఓ మీడియేటర్​ ద్వారా మహబూబ్​నగర్​కు చెందిన కొందరు కల్లు వ్యాపారులు పెద్ద మొత్తంలో అల్ర్పాజోలంను దిగుమతి చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. రాయచూర్​ ప్రాంతం నుంచి కారులో పాలమూరుకు రవాణా అవుతున్నట్లు తెలిసింది. ఈ కారు పాలమూరుకు చేరుకున్నాక ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఏరియాలకు ఏజెంట్ల ద్వారా సప్లై జరుగుతోందనేది బహిరంగ రహస్యం. కారు వచ్చే మార్గంలో టై రోడ్​ వద్ద ఎక్సైజ్​, ఆర్టీఐ డిపార్ట్​మెంట్ల చెక్​ పోస్టులున్నా, ఆ వెహికల్​ను అడ్డుకోవడం లేదనే విమర్శలున్నాయి.