
- ఏప్రిల్ నెల ఆదాయం రూ.16,473 కోట్లు
- ఉద్యోగుల శాలరీస్, పెన్షన్స్, అప్పులపై వడ్డీలు, కిస్తీలకే రూ.12 వేల కోట్లు
- మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు, ఇతర అత్యవసరాల నిర్వహణకు
- తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ.. సంక్షేమ పథకాలకు సమస్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగుల జీతాలు, అప్పుల కిస్తీలు, వాటి వడ్డీల చెల్లింపులకే పోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజనాకు వచ్చిన రాబడిలో వీటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేశారు.రా దీంతో సంక్షేమానికి తీవ్రంగా నిధుల కటకట ఏర్పడుతోంది. ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా కలిపి రాష్ట్రానికి రూ.16,473 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.12 వేల కోట్లకుపైగా నిధులు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే పోయాయి. మిగిలిన నాలుగున్నర వేల కోట్ల ఆదాయంలో ప్రతినెలా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు, గ్రీన్చానెల్కింద నిధులు మంజూరు చేయాల్సిన ఇతర కొన్ని ముఖ్య పథకాలకు ఖర్చు చేయగా మరికొన్ని నిధులతో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లించారు. దీంతో కొత్త స్కీమ్లను ప్రకటించినప్పటికీ.. వాటిని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కాగ్ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
తగ్గిన మూలధన వ్యయం
గతేడాది ఏప్రిల్లో జీతాల కోసం రూ.3,847 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.3,968 కోట్లకు పెరిగింది. పెన్షన్ల కోసం పోయినసారి రూ.1,335 కోట్లు ఖర్చు చేయగా, మొన్న ఏప్రిల్లో ఇది రూ. 1,569.86 కోట్లకు చేరింది. మరోవైపు అప్పులపై వడ్డీలు కూడా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1,900 కోట్ల వరకు చెల్లింపులు చేయగా.. ఈ ఏప్రిల్ నాటికి ఇది రూ.2,260 కోట్లకు ఎగబాకింది. వీటికి తోడు కిస్తీలకు ఈసారి ఏప్రిల్ నెలలో 4వేల కోట్ల రూపాయాలపైనే చెల్లించారు. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2024 ఏప్రిల్లో రూ.2,246 కోట్లు అప్పులు చేయగా.. ఈసారి ఇది రూ.5,230 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) తగ్గుముఖం పట్టింది. పోయినేడాది ఏప్రిల్లో రూ.3,119 కోట్ల మూలధన వ్యయం ఉండగా, మొన్నటి ఏప్రిల్లో ఇది రూ. 1,204 కోట్లకు తగ్గింది. మూలధన వ్యయం తగ్గడం అంటే మౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గిపోవడమేనని, ఇది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం ఆదాయం పెరిగినా.. ట్యాక్స్ రాబడి తగ్గింది
ఓవరాల్గా పోయిన ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఆదాయం.. ఈ సారి ఏప్రిల్తో చూస్తే రూ.2 వేల కోట్ల పైనే పెరిగింది. కానీ, ఇందులో పన్నుల ఆదాయం రూ.600 కోట్లు పడిపోయింది. అయితే, అప్పులు ఎక్కువగా తీసుకోవడంతో మొత్తం ఆదాయం పెరిగిందని.. సాధారణంగా గతంతో చూస్తే కొంత రాబడి తగ్గినట్టేనని ఆఫీసర్లు అంటున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రభుత్వానికి మున్ముందు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.