- రూ. 286 కి పెరగనున్న కంపెనీ ఆర్పూ
- టారిఫ్ పెంపు, 2జీ అప్గ్రేడేషన్, 5జీ సర్వీస్లతో ముందుకు
- వెల్లడించిన యాంటిక్ స్టాక్ బ్రోకింగ్
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఎలక్షన్స్ తర్వాత కచ్చితంగా టారిఫ్లు పెంచుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. రేట్ల పెంపు కనీసం 15–17 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టారిఫ్లను మొదట ఎయిర్టెల్ పెంచుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1 తో ఎంపీ ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 4 న రిజల్ట్స్ వెలువడనున్నాయి. టెలికం కంపెనీలు చివరిసారిగా 2020 లో టారిఫ్ రేట్లను 20 శాతం మేర పెంచాయి. ఎయిర్టెల్ యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) ప్రస్తుతం రూ.208 దగ్గర ఉందని, 2026–27 నాటికి ఈ నెంబర్ను రూ.286 కు పెంచుకోవాలని చూస్తోందని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఆర్పూనే ఎక్కువగా ఉందని తెలిపింది. ‘టారిఫ్లను పెంచడం ద్వారా ఎయిర్టెల్ ఆర్పూ రూ.55 పెరుగుతుంది. 2జీ కస్టమర్లను 4జీకి మార్చడం ద్వారా మరో రూ.10 పెరుగుతుంది. 4జీ, 5జీ కస్టమర్లు ఎక్కువ డేటా ప్లాన్ను ఎంచుకునేలా చేయడం, పోస్ట్పెయిడ్ ప్లాన్లను అమ్మడం ద్వారా కంపెనీ ఆర్పూ అదనంగా రూ.14 పెరుగుతుంది’ అని ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వెల్లడించింది. ఎయిర్టెల్ కస్టమర్ల బేస్ ఏడాదికి 2 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
టారిఫ్ హైక్, 2జీ అప్గ్రేడేషన్, ఫైబర్ టూ హోమ్ వృద్ధి చెందడం, 5జీ అమలు చేశాక క్యాపెక్స్ తగ్గడంతో రానున్న మూడేళ్ల వరకు ఎయిర్టెల్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది’ అని పేర్కొంది. సమస్యలు కూడా లేకపోలేదని, ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే డిఫరెంట్ రూట్లో 5జీ సర్వీస్లను కంపెనీ తీసుకొచ్చిందని, కానీ సబ్స్క్రయిబర్లు పడిపోయే అవకాశం తక్కువని తెలిపింది. అలానే ప్రస్తుతం కంపెనీల వాల్యుయేషన్స్ టెలికం సెక్టార్ పరిస్థితులను చూపడం లేదని పేర్కొంది. ఎయిర్టెల్ షేరు బుధవారం రూ. 1,229 దగ్గర సెటిలయ్యింది.
రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు..
‘2023–24 లో రూ. 75 వేల కోట్లను ఎయిర్టెల్ ఖర్చు (క్యాపెక్స్) చేసింది. 5జీ అమల్లోకి తెచ్చాక, క్యాపెక్స్ ఖర్చులు తగ్గుతాయి’ అని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ తెలిపింది. ‘2026–27 నుంచి ఐదేళ్లలో రూ. 75 వేల కోట్లను ఖర్చు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం ఏడాదికి చేస్తున్న రూ.19,000 – 20 వేల కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మొత్తం టెలికం ఇండస్ట్రీ డీటీహెచ్, ఎఫ్టీటీహెచ్ వంటి సర్వీస్ల కోసం చేస్తున్న క్యాపెక్స్ ఏడాదికి రూ.26 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్లకు తగ్గనుంది’ అని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేస్తోంది. ఎయిర్టెల్, జియో గత ఐదున్నరేళ్ల నుంచి తమ సబ్స్క్రయిబర్లను పెంచుకుంటున్నాయి. ఇదే టైమ్లో వొడాఫోన్ ఐడియా (వీ), బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను కోల్పోతున్నాయి. వీ మార్కెట్ షేర్ 2018 లో 37.2 శాతం ఉంటే, ప్రస్తుతం 19.3 శాతానికి తగ్గింది. ఎయిర్టెల్ మార్కెట్ షేర్ 29.4 శాతం నుంచి 33 శాతానికి, జియో మార్కెట్ షేర్ 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెరిగింది.