జూలూరుపాడు, వెలుగు: మండలంలోని బొజ్జ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని దండాల చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతిచెందాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలను విక్రయించేందుకు ఆదివారం సాయంత్రం మత్స్యకారులు వలలతో చేపలను పట్టి చెరువులోని దరికి చేర్చారు.
ఉదయం విక్రయించాలనే ఉద్దేశ్యంతో వలల వలయంలోనే చెరువు అంచున చేపలను ఉంచారు. అధిక ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ అందకపోవడం వల్ల అవి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 క్వింటాళ్లకు పైగా చేపలు మృతిచెందినట్లు అంచనా వేస్తున్నారు. మృగశిర కార్తె సందర్భంగా మంచి ధర లభిస్తుందనే ఆశతో విక్రయాలకు సిద్ధం చేసిన చేపలు మృతిచెందడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
