న్యూఢిల్లీ: ఇండియా, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన తమ పిల్లల సేఫ్టీ విషయంలో వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. రెండు దేశాల మధ్య తలెత్తిన దౌత్యపరమైన విభేదాలు తమ పిల్లల చదువులపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. కెనడాలో తమ పిల్లలపై దాడులు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లపై వివక్ష పెరిగే ప్రమాదముందని, ఇండియన్స్ అని చిన్నచూపు చూస్తారేమో అని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.
కెనడాకి వెళ్లి చదువుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న స్టూడెంట్లు కూడా డైలమాలో పడ్డారు. ఇండియా, కెనడా మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలుండడంతో వాళ్ల ప్లాన్లన్నీ తలకిందులయ్యాయి. వీసా సర్వీసులు ఆపేయడం కూడా వాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కెనడాలోని ఇండియన్ స్టూడెంట్ల సేఫ్టీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్తో అక్కడి పరిస్థితులపై పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖార్ మాట్లాడారు.
భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సునీల్ చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి కెనడాలోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ నుంచి పూర్తి సమాచారం పొందొచ్చని వివరించారు. త్వరలో ఓ వాట్సాప్ నంబర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. పిల్లలు ఎప్పటికప్పుడు పేరెంట్స్తో టచ్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.