ఏపీలో జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఏపీలో జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
     

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలను జులైలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించే వాతావరణం ఏర్పడుతుందని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మీడియాకు తెలిపారు. అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 36 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మంది
ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇంత భారీ ఎత్తున విద్యార్థులు హాజరవుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాల్సి ఉందని మంత్రి సురేష్ వెల్లడించారు. ఈ నెల 20 వరకూ లాక్ డౌన్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నెలాఖరులో  వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్  ప్రకటించాలని భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్‌ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.