
ఇంట్లోనే కాదు..బ్యాంకుల్లోనూ డబ్బులకు గ్యారెంటీ లేకుండా పోతుంది. కూతురు పెళ్లి కోసం కష్టపడి పైసా పైసా కూడపెట్టి..రూ. 18 లక్షలను బ్యాంకులో దాచిపెట్టగా..ఆ డబ్బులు చిత్తు కాగితాల్లా మారిపోయాయి. బ్యాంకు లాకర్లలో రూ. 18 లక్షలు దాచిపెడితే..ఆ డబ్బంతా చెదలు తినేశాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన అల్కా పాఠక్ అనే మహిళ తన కుమార్తె పెళ్లి కోసం రామగంగా విహార్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలోని లాకర్లో నగలతో పాటు నగదును దాచింది. రూ.18 లక్షల డబ్బును బ్యాంకు లాకర్లో దాచుకుంది. అయితే అల్కాపాఠక్ డబ్బు కోసం బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో బ్యాంకు అధికారులు డబ్బు దాచిన ఆ లాకర్ ను ఓపెన్ చేసి చూడగా.... రూ.18 లక్షలు చిత్తు కాగితాల్లా మారిపోయాయి. డబ్బునంతా చెదలు తినేశాయి. దీంతో అల్కాపాఠక్ తోపాటు బ్యాంకు అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 18 లక్షలు చెదల పాలయ్యే సరికి మహిళ అల్కా పాఠక్ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ తర్వాత బ్యాంకు మేనేజర్ ఈ ఘటనపై స్పందించి విచారణ చేపట్టారు.
Also Read :- ఈ ఐదు అలవాట్ల వల్ల ఆమె కోట్లు సంపాదించింది
రాజస్థాన్ లోని ఉదయపూర్లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయపూర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) బ్రాంచ్లోని లాకర్లో ఓ మహిళ దాచుకున్న రూ.2.15 లక్షల నగదును చెదలు తినేసింది. సునీతా మెహతా అనే కష్టమర్ రూ.2 లక్షలను బట్టల సంచిలో మిగిలిన నగదును బ్యాగ్ బయట లాకర్ లో భద్రపరిచింది. కొద్ది రోజుల తర్వాత డబ్బు కోసం లాకర్ తెరిచి చూడగా..రూ. 2.15 లక్షల నగదు మొత్తం చెదల పాలైంది. విడిగా ఉంచుకున్న రూ.15వేలు తారుమారు అయ్యాయి.