‘ఆర్మూర్​- ఆదిలాబాద్’ రైల్వే లైన్ ​పన్నెండేండ్లుగా పెండింగ్

‘ఆర్మూర్​- ఆదిలాబాద్’ రైల్వే లైన్ ​పన్నెండేండ్లుగా పెండింగ్
  • ఫండ్స్​లేవని  పట్టించుకోని రాష్ట్ర  ప్రభుత్వం
  • కేంద్రం నిర్మించాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీల వినతి 
  • ఆర్మూర్​ నుంచి ఉత్తరాదికి భారీగా విత్తనాల రవాణా
  • రవాణ సౌలత్ ​లేక రైతుల ఇబ్బందులు


నిజామాబాద్,  వెలుగు: ఆర్మూర్- ఆదిలాబాద్ జిల్లా రైల్వే లైన్ నిర్మాణం​12 ఏండ్లుగా పెండింగ్ పడుతూనే వస్తోంది. జిల్లా రైతుల డిమాండ్​ మేరకు 2011లో అప్పటి కాంగ్రెస్ ​ప్రభుత్వ హయాంలో శాంక్షన్​అయిన రైల్వే లైన్​ను టీఆర్ఎస్ ​ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. 2016–17 బడ్జెట్​ సమయంలో ప్రపోజల్స్​ పంపినా.. వాటా విషయంలో వెనక్కి తగ్గింది. ఈ  నేపథ్యంలో  నిజామాబాద్, ఆదిలాబాద్​ ఎంపీలు  కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి  రైల్వే లైన్​ పూర్తి చేయాలని రైల్వే మంత్రికి ఇటీవల వినతి పత్రాలు ఇచ్చారు.  దీంతో  ‘ఇకనైనా  రైల్వే ట్రాక్​కు మోక్షం కలిగేనా?’  అని జిల్లా రైతులు ఎదురు చూస్తున్నారు. 

అగ్రి మార్కెటింగ్ కు  రైల్వే లైన్..

 విత్తన ఉత్పత్తులకు పేరుగాంచిన ఆర్మూర్​లో  రైల్వే లైన్లు విస్తరించాలని 30 ఏండ్లుగా డిమాండ్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బాగా పండే పసుపు, సజ్జ, ఎర్ర జొన్న , మొక్క జొన్న , సోయాబిన్ పంటలను  ఉత్తరాది ప్రాంతాలకు తరలిస్తారు. నిజామాబాద్, హైదరాబాద్​ మీదుగా రైల్వే రవాణ చార్జీల భారం ఎక్కువవుతుండడంతో ఇక్కడి నుంచి  రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ​ప్రభుత్వం 136 కిలోమీటర్లు రూ. 1,050 కోట్ల బడ్జెట్ తో రైల్వేలైన్ కు కేంద్రానికి ప్రపోజల్స్​ పంపింది. దీంతో  కేంద్ర రైల్వేశాఖ  ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్  ఏర్పాటుకు సర్వే చేసింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఘాట్ ఏరియాతో బడ్జెట్ డబుల్​ అవుతుందని  రైల్వేశాఖకు  రిపోర్టు ఇచ్చింది.  

అడుగేసి.. వెనక్కి తగ్గి..

2016–-- 17 కేంద్ర బడ్జెట్ కు ముందు సీఎం కేసీఆర్ సూచనలతో అప్పట్లో రాష్ట్ర మంత్రులుగా ఉన్న జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు  ఆదిలాబాద్​ ఎంపీ గొడం నగేశ్ తో కలిసి నాటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్​ ప్రభును కలిశారు.  -ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో రాష్ట్ర వాటా కింద 50 శాతం నిధులను భరిస్తామని తెలిపారు. దీంతో అప్పటి కేంద్ర బడ్జెట్​లో క్యాస్టెల్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ కింద శాంక్షన్​ చేసింది. 198 కిలోమీటర్ల పరిధిలో రూ.2,720 కోట్ల అంచనా వ్యయంతో ఈ లైన్​ను ప్రతి పాదించింది. ఇందులో రాష్ట్రం వాటా 50 శాతం అంటే.. సుమారుగా రూ.1380 కోట్లు భరించాలి. ఆ తర్వాత కాలంలో రెండు ప్రభుత్వాలు దీని ఊసే ఎత్తలేదు.  ఈ నేపథ్యంలో నిజామాబాద్​ఎంపీ అరవింద్​ ధర్మపురి, ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు జిల్లా ప్రజల డిమాండ్​ మేరకు కేంద్ర ప్రభుత్వం వందశాతం ఫండ్స్​తో రైల్వే లైన్​నిర్మించాలని రైల్వే మంత్రికి ఇటీవల వినతి పత్రం ఇచ్చారు.  బడ్జెట్ లో నిధు లు మంజూరు
 లభిస్తుందా అనేది చూడాల్సిందే. 

 ఉద్దేశపూర్వకంగానే ప్రపోజల్స్ పంపుతలేరు..

 రాష్ట్రంలో రైల్వే లైన్ల విస్తరణలో కేసీఆర్​ సర్కార్​ఫెయిలయ్యింది.  కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని  ఉద్దేశపూర్వకంగానే ప్రపోజల్స్ పంపుతలేరు. రవాణ సౌకర్యం లేక ఆర్మూర్​రైతులు చాలా నష్టపోతున్నారు. ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్ వల్ల విత్తనోత్పత్తి పంటలకు రేటు వచ్చి రైతులు లాభపడుతారు.  

- పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు

రైల్వే బడ్జెట్ లో  ప్రాజెక్ లపై వివక్ష  

 కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష కొనసాగుతోంది. ఆర్మూర్​– ఆదిలాబాద్​ రైల్వే లైన్​ను కేంద్రమే నిర్లక్ష్యం చేస్తోంది.  బీఆర్ఎస్​కు లబ్ధి జరుగుతుందని ఫండ్స్​కేటాయించడం లేదు. ఈ బడ్జెట్​లో ఫండ్స్​కేటాయించి రైల్వే లైన్​నిర్మించాలి.  

- మార గంగారెడ్డి, మార్క్​ఫెడ్ ​చైర్మన్​