నాలుగేళ్లుగా కొనసాగుతున్న మెదక్ కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ పనులు

నాలుగేళ్లుగా కొనసాగుతున్న మెదక్ కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ పనులు

మెదక్, వెలుగు: అవసరమైన స్థల సేకరణ పూర్తికావడం..  ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం.. స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో మెదక్​ కొత్త ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ బిల్డింగ్​త్వరగా పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ నాలుగున్నరేండ్లు అవుతున్నా కొత్త బిల్డింగ్​పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. ఈ మేరకు పిల్లికొటాల్​శివారులోని ప్రైవేట్ బిల్డింగ్​అద్దెకు తీసుకుని అందులో  కలెక్టరేట్​ఏర్పాటు చేశారు. కాగా అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్‌ బిల్డింగ్​లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా మెదక్​ లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్​ బిల్డింగ్, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్​క్వార్టర్, 8 జిల్లా స్థాయి అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి రూ.48.61 కోట్లు మంజూరయ్యాయి. ఈ బిల్డింగ్​ల నిర్మాణం కోసం పట్టణ సమీపంలోని ఔరంగాబాద్‌ శివారులోని సర్వే నంబర్‌ 78లో 33 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 2018 మే 9న సీఎం కేసీఆర్‌ ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్‌ బిల్డింగ్​నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాబ్రా అసోసియేట్స్​ టెండర్​ దక్కించుకోగా, ఆర్​అండ్​బీ డిపార్ట్​మెంట్​ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 డిసెంబర్​లోపు పనులు పూర్తి కావాలి. అయితే కరోనా కారణంగా లేబర్​సమస్యతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గడువును 2021 నవంబర్​నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఆ గడువు కూడా పూర్తియి ఏడాది గడచినా పనులు కలెక్టరేట్​ రెడీ కాలేదు.  గతేడాది డిసెంబర్​ లో సీఎం చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్​ ప్రాంరంభోత్సవం ఉంటుందని ప్రజా ప్రతినిధులు చెప్పారు. కానీ పనులు పెండింగ్ లో ఉండటంతో అది వాయిదా పడింది. మెయిన్​ బిల్డింగ్, గ్రౌండ్ ​ఫ్లోర్ పూర్తయినప్పటికీ, పై అంతస్తులో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన నిధులు లేక పనులు చేపట్టలేదు. ఈ పనులకు అవసరమైన నిధుల కోసం ఆర్​ అండ్ ​బీ అధికారులు గతేడాది మేలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా ఆరు నెలల తరువాత గత నవంబర్​లో ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది. కాగా ఈ పనులు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 

డిలేపై జడ్పీ చైర్​పర్సన్ ​అసహనం

ఇంటిగ్రేటెడ్ ​కలెక్టరేట్ ​బిల్డింగ్ ​పనుల జాప్యంపై శుక్రవారం జరిగిన జడ్పీ స్టాండింగ్​ కౌన్సిల్​ మీటింగ్​లో జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత శేఖర్​ గౌడ్ ​అసహనం వ్యక్తం చేశారు. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్​ అండ్​ బీ అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆర్​అండ్ బీ డీఈఈ వెంకటేశం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ మెయిన్​ బిల్డింగ్​ పనులు పూర్తికాగా, సెకండ్​ ఫ్లోర్​ లో సీలింగ్​ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ పనులు త్వరలో పూర్తవుతాయని, ఇటీవల మంజూరైన రూ.9 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతామని చెప్పారు.