కమల్నాథ్ బర్త్డే కేక్పై దుమారం
గుడి ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న కాంగ్రెస్ లీడర్
ఇది హిందువులను అవమానించడమేనని బీజేపీ ఫైర్
భోపాల్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ కమల్నాథ్ బర్త్డే వేడుకల్లో కేక్ కటింగ్ వివాదాస్పదమైంది. ఆలయం ఆకారంలో ఉన్న కేక్ కట్ చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులను అమానించడమే అని మండిపడ్డారు. కేక్ కటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల పర్యటన కోసం కమల్నాథ్ హోంటౌన్ చింద్వారా వచ్చారు. శుక్రవారం ఆయన బర్త్డే ఉంది. కాంగ్రెస్ నేతలు అడ్వాన్స్గా ఆయన ఇంట్లోనే కేక్ కట్ చేయించేందుకు ప్లాన్ చేశారు. ఆలయం ఆకారంలో ఉన్న కేక్ తీసుకొచ్చారు. దానిపై కాషాయం కలర్ జెండా, హనుమంతుడి ఫొటో పెట్టారు. ఈ కేక్ను కమల్నాథ్ కట్ చేశారు. దీంతో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మండిపడ్డారు. మతపరమైన సింబల్స్ ఉన్న కేక్ కట్ చేసి కమల్నాథ్.. ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు.
‘‘కాంగ్రెస్ లీడర్ల భక్తితో మాకెలాంటి సంబంధం లేదు. ఆ పార్టీలో దొంగ భక్తులు ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆ పార్టీకి కమల్నాథ్ నేతృత్వం వహిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దొంగ భక్తిని ప్రదర్శిస్తున్నారు. తాము కూడా హనుమాన్ భక్తులం అంటూ చెప్పుకుంటున్నారు. హనుమంతుడి బొమ్మ కేక్పై పెట్టి.. దాన్ని కట్ చేయడం అంటే హిందువులను, సనాతన ధర్మాన్ని కించపర్చడమే అవుతుంది”అని శివరాజ్సింగ్ చౌహాన్ విమర్శించారు.