కేసు పట్టించుకోలేదని  పీఎస్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

కేసు పట్టించుకోలేదని  పీఎస్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

వైరా, వెలుగు: పొలానికి నీళ్లు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని కంప్లైంట్​చేస్తే.. కనీస చర్యలు తీసుకోలేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఖమ్మం జిల్లా వైరా పోలీస్​స్టేషన్​లోనే ఆత్మహత్యా యత్నం చేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మండలంలోని కొండకూడిమకు చెందిన కోట మరియమ్మకు గ్రామంలో ఎకరం పొలం ఉంది. దానికి నీళ్లు రాకుండా ఆడబిడ్డ లాలమ్మ అడ్డుకుంటోందని గతనెల 9వ తేదీన మరియమ్మ వైరా పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్​ చేసింది. ఇన్ని రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం పీఎస్​కు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. గమనించిన సిబ్బంది వెంటనే స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. మెరుగైన ట్రీట్​మెంట్​కోసం అక్కడి నుంచి ఖమ్మం గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు.