సేమ్​ సెక్స్​ పెండ్లిని గుర్తించలేం

సేమ్​ సెక్స్​ పెండ్లిని గుర్తించలేం

సేమ్​ సెక్స్​ పెండ్లిని గుర్తించలేం
వాటికి చట్టబద్ధత కల్పించబోం 
సుప్రీంలో కేంద్రం కౌంటర్​
ఇది హక్కుల ఉల్లంఘన కిందికి రాదని స్పష్టం 
ఇయ్యాల సుప్రీంకోర్టు విచారణ

న్యూఢిల్లీ : సేమ్ సెక్స్​ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈమేరకు వాదనలతో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్​ను దాఖలు చేసింది. పెండ్లి అనేది.. కేవలం ఆడ, మగ మధ్య జరిగే ఘట్టమని తెలిపింది. సేమ్​ సెక్స్​ మ్యారేజెస్​ అనేవి భారత సంస్కృతికి విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. 2018 సంవత్సరంలో రాజ్యాంగంలోని 377 సెక్షన్ ను డీక్రిమినలైజ్ చేయడాన్ని గుర్తుచేస్తూ.. సేమ్​ సెక్స్​ మ్యారేజెస్​కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్​కు దాన్ని ప్రాతిపదికగా పరిగణించలేమని కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుత చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సేమ్​ సెక్స్​ మ్యారేజెస్​ను గుర్తించకపోవడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదని పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన ఈ అఫిడవిట్​తో పాటు దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారించనుంది. 

పర్సనల్​లా ప్రొవిజన్స్​కు విఘాతం

సేమ్​ సెక్స్​ రిలేషన్​షిప్​ను.. భార్యాభర్తలు, పిల్లలతో కూడిన భారత కుటుంబ వ్యవస్థతో పోల్చి చూడలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ‘ఆడ, మగ మధ్య జరిగే పెండ్లిళ్లను గుర్తించేందుకు హిందూ మ్యారేజ్​ యాక్ట్​1955, క్రిస్టియన్​మ్యారేజ్​ యాక్ట్​1872, పార్సీ మ్యారేజ్​ యాక్ట్​ 1936, స్పెషల్​ మ్యారేజ్​ యాక్ట్ 1954, ఫారిన్​ మ్యారేజ్​ యాక్ట్​ 1969 ఉన్నాయి. వీటికి లోబడే ఆయా వర్గాల పెండ్లిళ్లు జరుగుతుంటాయి” అని తెలిపింది. ‘‘స్త్రీ, పురుషుల వివాహాలను మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇతరత్రా జరిగే పెండ్లిళ్లను గుర్తించలేం. అయితే, ఇదే సమయంలో మిగతా రకమైన సంబంధాలు చట్టవ్యతిరేకమైనవని అనలేం” అని అఫిడవిట్​లో పేర్కొంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సనల్​ లా ప్రొవిజన్స్​కు విఘాతం కలుగుతుందని కేంద్రం తెలిపింది.