
త్వరలోనే కేంద్రంతో ఒప్పందం చేసుకునే చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ట్రీట్మెంట్ కోసం పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఎస్ఐ) తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రేటును రూ.250గా నిర్ణయించినట్టు సమాచారం. ఇదే రేటుకు కేంద్రానికి సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు త్వరలోనే సప్లై కాంట్రాక్టు దరవచ్చని, చర్చలు దాదాపు పూర్తి కావొచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ వ్యాక్సిన్ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇవ్వాలని ఎస్ఎస్ఐ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం కోరిన విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికాతో కలసి ఈ ఫార్మా కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ను డెవెలప్ చేసింది. అయితే ఈ కంపెనీ మనదేశానికి ఎన్నో డోసులు సప్లై చేస్తుందనే విషయం తెలియరాలేదు. త్వరలో దాదాపు ఆరు కోట్ల డోసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరుతుందని పేర్కొన్నాయి.
ప్రభుత్వ పరిశీలనలో మూడు వ్యాక్సిన్లు
ఇండియాలో డెవలప్ చేస్తున్న కరోనా వ్యాక్సిన్లలో కొన్నింటికీ త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఆరు వరకు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, మూడు వ్యాక్సిన్లు లైసెన్సింగ్ కోసం పరిశీలనలో ఉన్నాయని చెప్పింది. వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఇప్పటికే అప్లై చేసుకున్నాయని హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్ భూషణ్ చెప్పారు. టీకా ప్రొడక్షన్, పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసిందని.. ప్రతి ఒక్కరికీ వీలైనంత తక్కువ టైమ్లో వ్యాక్సిన్ అందించడమే సర్కారు లక్ష్యమని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెల్త్ కేర్ వర్కర్ల డేటా సేకరణ ఇప్పటికే స్టార్టయిందన్నారు. ‘కో విన్’ సాఫ్ట్వేర్లో ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారని, వివరాలను వెరిఫై చేయాల్సి ఉందని అన్నారు. వ్యాక్సినేషన్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని మాత్రమే కాదని, జనం పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పారు. తొలుత 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తామని, తొలి దశ టీకాల స్టోరేజ్కు ప్రస్తుతమున్న కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ సరిపోతుందని అన్నారు. ప్రస్తుతం 2.39 లక్షల మంది వ్యాక్సినేటర్లు దేశంలో ఉన్నారని, వీళ్లలో 1.54 లక్షల మందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ పని అప్పగిస్తామని తెలిపారు.