
- కారులో వ్యక్తి దహనం కేసులో బిగ్ ట్విస్ట్
- చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నడు.. పోలీసులకు దొరికిండు
- తాను చనిపోయినట్లు బీమా కంపెనీని నమ్మించేందుకు డ్రామా
- చనిపోయింది కారు డ్రైవరా.. అడ్డా కూలీనా?
మెదక్ (టేక్మాల్), వెలుగు : ఆన్లైన్ గేమ్లు ఆడి, బెట్టింగ్లు కట్టి పెద్ద మొత్తంలో నష్టపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడిన మర్డర్ డ్రామా బట్టబయలైంది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనలో ఎవరూ ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కారు దహనమై చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కారులో హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది.
సీసీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటాలో..
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ వద్ద ఈ నెల 9న కారులో ఓ వ్యక్తి దహనమయ్యాడు. ఈ కారు హైదరాబాద్ సెక్రటేరియట్లోని ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న బీమ్లా తండావాసి ధర్మా నాయక్దిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగులో ధర్మా నాయక్కు సంబంధించిన పలు డాక్యుమెంట్లు దొరకడంతో.. ఆ కారులో దహనమైంది అతడేనని తొలుత భావించారు. ఆ కోణంలోనే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కానీ సీసీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించాక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కారు దహనం సంఘటనలో చనిపోయాడు అని భావిస్తున్న ధర్మా నాయక్ బతికే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
అతడిని మహారాష్ట్రలోని పుణెలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఆన్లైన్ గేమ్స్ ఆడి, బెట్టింగ్లు పెట్టి కోట్లలో నష్టపోయిన ధర్మా నాయక్.. వాటిని తీర్చేందుకే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ డ్రామా ప్లాన్ చేశాడని భావిస్తున్నారు. తాను చనిపోతే దాదాపు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని.. వాటితో అప్పులన్నీ తీర్చేయొచ్చని చెప్పి ఈ పథకం వేసినట్టు తెలుస్తోంది.
మర్డర్ ప్లాన్ అమలైన 4 రోజుల తర్వాత..
చేగుంట, హైదరాబాద్కు చెందిన ఫ్రెండ్స్ తో కలిసి బాసరకు వెళ్తున్నట్టు ఈ నెల 5న ఇంట్లో చెప్పి ధర్మా నాయక్ వెళ్లాడని సంఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇంటి నుంచి వెళ్లిన నాలుగు రోజుల తరువాత (జనవరి 9న).. ఓ వ్యక్తిని తన దగ్గరి బంధువు సహకారంతో చంపేసి, కారులోనే డెడ్ బాడీని ఉంచి వెంకటాపూర్ సమీపంలోని కుంట వద్ద నిప్పు పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి ధర్మా నాయక్ పరారైనట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన మూడు, నాలుగు రోజుల తర్వాతి నుంచి.. ధర్మా నాయక్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డెత్ సర్టిఫికెట్ తీసుకోమని చెబుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని సెల్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా ఆచూకీ గుర్తించినట్లు సమాచారం. వెంకటాపూర్ గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా జనవరి 8వ తేదీన రాత్రి ధర్మానాయక్ తన కారులో తండాకు వెళ్లినట్టు గుర్తించారు. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లిన పోలీసులు.. అతన్ని పుణెలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ ప్లాన్లో అతడికి సహకరించిన బంధువును కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. ధర్మానాయక్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన టెంపరరీ డ్రైవర్ కావొచ్చని కొందరు అంటుండగా.. బాసర నుంచి తీసుకొచ్చిన అడ్డా కూలీ అయి ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. అయితే అతన్ని ఎక్కడ.. ఎలా చంపేశారు? అనేది ధర్మా నాయక్ నోరు విప్పి పోలీసులకు చెబితే గానీ తెలిసేలా లేదు.