
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారి నుంచి ఎకానమీ త్వరగానే కోలుకుంటోంది. లాక్డౌన్ టైమ్లో భారీగా జీతాల కోతను, ఉద్యోగాల కోతను ప్రకటించిన కంపెనీలు.. ప్రస్తుతం ప్రమోషన్లను, బోనస్లను, జీతాల పెంపును చేపడుతున్నాయి. గ్రోఫర్స్, జొమాటో, అప్గ్రేడ్ లాంటి స్టార్టప్ కంపెనీలు, పెద్ద పెద్ద ఆటో కంపెనీలు ఇంక్రిమెంట్లను ప్రకటిస్తున్నాయి. అంతేకాక బోనస్లను ఇస్తున్నాయి. రెండు నెలల పాటు లాక్డౌన్ దెబ్బకు మూతపడ్డ వ్యాపారాలు మెల్లమెల్లగా ఓపెన్ కావడం ప్రారంభమయ్యాయి.
ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వేతన కోతను ప్రకటించిన స్టార్టప్ ఇప్పుడు జీతాలను ప్రీకరోనా స్థాయిలకు తీసుకొచ్చాయి. తిరిగి పూర్తి జీతాలను ఇవ్వడం ప్రారంభించినట్టు గ్రోఫర్ ధృవీకరించింది. వ్యాపారాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని, జూలై1 నుంచి వేతనాలను మళ్లీ సాధారణ స్థాయికి తీసుకొచ్చినట్టు గ్రోఫర్స్ కో ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ కూడా ఉద్యోగులకు ఒరిజినల్ శాలరీలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక ఆన్లైన్ ట్రావెల్ ఆపరేటర్ ఇక్సిగో కూడా జీతాలను రీస్టోర్ చేస్తున్నట్టు తెలిపింది.
‘లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సరళీకరించింది. విమానాలు తిరగడం ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతోంది. మేము అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే డిమాండ్ ఉంది. జూలై నుంచి శాలరీలను ఫిబ్రవరి లెవెల్లో ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఇక్సిగో చీఫ్ ఎగ్క్యూజి క్యూటివ్ అలోక్ బాజ్పేయి చెప్పారు. స్నాప్డీల్ సుమారు 700 మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రకటించింది. మా టీమ్ కోసం తాము ఇది చేయాల్సి ఉందని స్నాప్డీల్ సీఈవో కునాల్ బహ్ల్ అన్నారు.
అయితే తీసేసిన ఉద్యోగులు గురించి కంపెనీ ఏమీ మాట్లాడలేదు. మేలో స్నాప్డీల్ తన మొత్తం వర్క్ఫోర్స్లో 7 శాతం మందిని పక్కన పెట్టింది. సుమారు 800 మంది కాంట్రాక్టులను రెన్యూవల్ కూడా చేయలేదు. అయితే మేనేజ్మెంట్ నిర్ణయాలు ఇంత ఇంత సడెన్గా మారుతుండటంతో స్టార్టప్ ల్లో చేరాలంటే కాస్త జాగ్రత్త వహించాల్సిందేనని ఎనలిస్టులు అన్నారు.
జీతాలు పెంచినహ్యుండాయ్..
మరోవైపు కార్ల కంపెనీలు కూడా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పడం ప్రారంభించాయి. మెల్లమెల్లగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను, ప్రమోషన్లను ప్రకటిస్తున్నాయి. దీంతో అంచనావేసిన దానికంటే త్వరగానే మార్కెట్ రికవర్ అవుతున్నట్టు తెలుస్తోంది. టయోటా కిర్లోస్కర్ యూనియన్లలో లేని వర్కర్లకు జీతాల పెంపును ప్రకటించింది. అదేవిధంగా హ్యుండాయ్ మోటార్ ఇండియా కూడా తన ఫ్యాక్టరీ్ వర్కర్లకు జీతాలను పెంచింది. కరోనా లాక్డౌన్తో పేరివిజన్ సైకిల్ అంతా మారిపోయింది. గత ఏడాది కాలమంతా ఆటో సెక్టార్కు గడ్డు కాలంగానే ఉంది. ఇక ఇప్పుడు కరోనాతో మరింత ఇబ్బంది పడుతోంది. దీంతో ఆటో సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు ఈ పరిస్థితులకు తీవ్ర ఆందోళన పడ్డారు. అయితే కరోనా ఇచ్చిన ఫైనాన్సియల్ లాక్ నుంచి తమవర్క్ఫోర్స్ను కాపాడామని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. గత 2 నెలల్లో 14 కార్ల కంపెనీల్లో 10 వరకు కంపెనీలు గత ఏడాదికి సంబంధించిన బోనస్లను, ఇన్సెంటివ్లను ప్రకటించాయి. ఆరు కంపెనీలు ప్రమోషన్లను ఇచ్చాయి. మిగిలిన కంపెనీలు ప్రమోషన్లను ఇచ్చే పనిలో పడ్డాయి. హోండా, టయోటాలు బేస్ శాలరీ, వారి పొజిషన్ బట్టి 4–14 శాతం వేతన పెంపును ప్రకటించాయి.
వచ్చే 2–3 నెలల్లో ఇంక్రిమెంట్లు ఇస్తాం…
మారుతీ, ఫోర్, స్కోడా, ఫోక్స్వాగన్, ఎంజీ మోటార్లు ప్రస్తుతం నిర్ణయాలను వాయిదా వేసినప్పటికీ, త్వరలోనే ఇవి కూడా ప్రకటిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘పరిస్థితులన్ని సాధారణ స్థాయికి వచ్చేస్తున్నాయి. వచ్చే 2–3 నెలల్లో మేము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇచ్చేందు ప్లాన్ చేస్తున్నాం’ అని ఎంజీ మోటార్ ఇండియా ఎండీ రాజీవ్ ఛబా అన్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం వేతన పెంపును చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఎలాంటి శాలరీ పెంపు ఉండదని మహింద్రా అండ్ మహింద్రా చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రాజేశ్వర్ త్రిపాఠి అన్నారు. మెజార్టీ కారు తయారీ కంపెనీలు ప్రీ కరోనా స్థాయుల్లో 85 శాతం రిటైల్ సేల్స్ను, బుకింగ్స్ను అందుకున్నాయి. కంపెనీలు కూడా ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ వర్క్ఫోర్స్ను వదులుకోకుండా.. కరోనాతో పోరాటం చేశాయి. వలస కూలీలు కూడా తమ గ్రామాల నుంచి ఫ్యాక్టరీలకు వచ్చేస్తున్నారు. దీంతో ఆపరేషన్స్ను కంపెనీలు పెంచుతున్నాయి.