
- ఓవర్ టు ఢిల్లీ
- హైకమాండ్ కు అభ్యర్థుల జాబితా
- త్వరలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
- 35 సెగ్మెంట్లలో దాదాపు పేర్లు ఖరారు?
- 70 చోట్ల టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ!
హైదరాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు కసరత్తు కొనసాగుతోంది. దాదాపు 35 మంది పేర్లతో కూడిన మొదటి జాబితాను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీ దాదాపు 35 చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వారి పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. అక్కడ ఫైనల్ అయిన జాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. 70 నియోజకవర్గాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఈ సెగ్మెంట్లలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్లనూ ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మహిళా బిల్లు నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఇవాళ, రేపు అక్కడే భేటీ అయి తొలి జాబితాను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా బీసీలకు టికెట్ల కేటాయింపు, మిగతా కులాలకు అవకాశం కల్పించడంపై చర్చ జరిగింది. దీంతో చాలా సెగ్మెంట్లపై చర్చించాల్సి ఉంది.
ముఖ్యనేతల నియోజకవర్గాలు ఫైనల్ అయినా..ఇద్దరు, ముగ్గురు దాదాపు 70 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఫైనల్ చేయడం కత్తిమీద సాములా మారనుంది. ఈ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, గెలుపు అవకాశాలు పరిగణనలోకి తీసుకొని ఫైనల్ చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన జాబితాను 16 మంది సభ్యులున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆ కమిటీలో రాష్ట్రం నుంచి నల్లగొండ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ చర్చ జరిగాక ఏఐసీసీ మొదటి జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ వారంలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.
అగ్రనేతల వద్దకు ఆశావహుల క్యూ
టికెట్లు ఆశిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వద్దకు క్యూ కడుతున్నారు. తమ తమ చానల్స్ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏఐసీసీ ముఖ్యనేతలను సంప్రదిస్తూ ఎలాగైనా తనకు టికెట్ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. కొందరు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసేందుకు బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. బీసీ నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ బీవీ హరిప్రసాద్ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమితులైన రఘువీరా రెడ్డి ద్వారా కొందరు పైరవీలు ప్రారంభించారు. ఇందుకోసం ఏపీ బాట పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను, దిగ్విజయ్ సింగ్ ను, వీరప్ప మొయిలీని, దిగ్విజయ్ సింగ్ ను కలిసి తమకు టికెట్ వచ్చేలా చూడాలని పలువురు వేడుకుంటున్నట్టు సమాచారం. జైరాం రమేశ్, కొప్పుల రాజా ద్వారా కూడా కొందరు టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఖరారు చేసిన పేర్లు ఇవే..?
1. కొడంగల్ :- రేవంత్ రెడ్డి
2. హుజూర్ నగర్ -: ఉత్తమ్ కుమార్ రెడ్డి
3.కోదాడ -: పద్మావతి
4. మధిర : - భట్టి విక్రమార్క
5. మంథని : - శ్రీధర్ బాబు
6. జగిత్యాల : జీవన్ రెడ్డి
7. ములుగు -: సీతక్క
8. భద్రాచలం - పొడెం వీరయ్య
9. సంగారెడ్డి -: జగ్గారెడ్డి
10. నల్గొండ : - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
11. అలంపూర్ : - సంపత్ కుమార్
12. నాగార్జునసాగర్- : కుందూరు జైవీర్ రెడ్డి
13. కామారెడ్డి :- షబ్బీర్ అలీ
14. పాలేరు :- తుమ్మల నాగేశ్వరరావు
15. కొత్తగూడెం : - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
16. పరిగి : - రామ్మోహన్ రెడ్డి
17. వికారాబాద్ : - గడ్డం ప్రసాద్ కుమార్
18. మహేశ్వరం : - చిగురింత పారిజాత
19. ఆలేరు : - బీర్ల ఐలయ్య
20. ఖైరతాబాద్ : - రోహిన్ రెడ్డి
21. దేవరకొండ -: వడ్త్య రమేష్ నాయక్
22. వేముల వాడ :- ఆది శ్రీనివాస్
23. ధర్మపురి - :లక్ష్మణ్
24. జడ్చర్ల - :అనిరుద్ రెడ్డి
25. హుజూరాబాద్ - :బల్మూర్ వెంకట్
26. నాంపల్లి - :ఫిరోజ్ ఖాన్
27. కోరుట్ల:జువ్వాడి నర్సింగ్ రావు
28.అచ్చంపేట - :వంశీకృష్ణ
29. జహీరాబాద్ - :ఏ. చంద్రశేఖర్
30. ఆందోల్ - :దామోదర రాజనర్సింహ
31.మంచిర్యాల - :ప్రేమ్ సాగర్ రావు
32. కొల్లాపూర్ - :జూపల్లి కృష్ణారావు
33. ఆదిలాబాద్: - కంది శ్రీనివాస్ రెడ్డి
34. వరంగల్ ఈస్ట్ -: కొండా సురేఖ
35. భూపాల పల్లి -: గండ్ర సత్యనారాయణ