ప్రేమించాడ‌ని ముక్క‌లుగా న‌రికి పొలంలో పాతిపెట్టాడు

ప్రేమించాడ‌ని ముక్క‌లుగా న‌రికి పొలంలో పాతిపెట్టాడు

చిత్తూరు జిల్లా: దృశ్యం సినిమాలాగే ఓ యువ‌కుడిని చంపి పాతిపెట్టిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌మ కూతురిని ప్రేమించ‌డంతో..యువ‌కుడిని చంపిన బాలిక తండ్రి త‌న‌ పొలంలోనే పాతిపెట్టిన‌ట్లు పోలీసుల‌కు నిజం చెప్పాడు.  నాలుగు రోజులుగా కనిపించకుండపోయిన కొడుకు ఇక లేడని తెలుసుకున్న యువ‌కుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో జ‌రుగ‌గా స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. 

చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23)బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే బాలిక(16)ను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో శేఖర్ వారం రోజుల కిందట గ్రామానికి వ‌చ్చాడు. ఈ నెల 22న తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి మొబైల్ నుండి ధ‌న‌శేఖ‌ర్ ఫోన్ కు మెసేజ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన ధ‌న‌శేఖ‌ర్..బాలిక‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్‌ను చూసి రగిలిపోయిన తండ్రి.. నీతో మాట్లాడాలి అంటూ ధనశేఖర్ ను వ్యవవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. పొలం వద్దకు చేరుకోగానే కత్తితో ధనశేఖర్‌ ను దారుణంగా నరికి చంపేశాడు. త‌ర్వాత‌ మృతదేహాన్ని బావిలో పడేశాడు. మూడు రోజుల తర్వాత శవం ఉబ్బిపోవడంతో హత్య విషయం బయటకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో.. మృతదేహాన్ని బయటకు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, తన పొలంలో పూడ్చి పెట్టాడు.

కొడుకు కనిపించకపోవడంతో.. ధనశేఖర్ తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రే తమ కుమారున్ని హత్య చేసి ఉంటాడని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తూ గురువారం సాయంత్రం రోడ్డుపై ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ధనశేఖర్‌ కాల్‌డేటా ఆధారంగా బాలిక తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు బాలిక తండ్రి బాబును అదపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం చెప్పేశాడు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.