- గత సీజన్లో 60 టీఎంసీలు, ఈసారి 33 టీఎంసీల నీళ్లే ఎత్తిపోత
- కన్నెపల్లి దగ్గర 17 మోటార్లలో ఏడే నడిచినయ్
- 53 రోజులు రన్ చేసి బంద్ పెట్టిన ఆఫీసర్లు
- ప్రాజెక్టు టార్గెట్ 225 టీఎంసీల ఎత్తిపోత..
- ఈ సీజన్లో 15% కూడా లిఫ్ట్ చేయలే
- వరుసగా రెండో ఏడాది టార్గెట్ అందుకోవడంలో ఫెయిల్
జయశంకర్ భూపాలపల్లి / నెట్వర్క్, వెలుగు: లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఆపతి కాలంలో అక్కరకు రావడం లేదు. ప్రాజెక్టు కింద సాగు చేసిన లక్షల ఎకరాల పంటలు నీళ్లందక ఎండిపోతున్నాయి. ఆయకట్టు మొత్తానికి నీళ్లు ఇస్తామన్న రాష్ట్ర సర్కార్ మాటలు నమ్మి పంటలు సాగు చేసిన రైతులు ఆగమైపోతున్నారు. ఎండిన పొలాలను చూసి తల్లడిల్లిపోతున్నారు. సమయానికి గోదావరి నీళ్లను ఎత్తిపోయడంలో సర్కార్ ఫెయిల్ అవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత సీజన్లో (2019 జూన్ నుంచి 2020 మే వరకు) 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే ఈ సీజన్లో కేవలం 33 టీఎంసీలు లిఫ్ట్ చేసింది.
ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు అడుగంటాయి. ఎగువన ప్రాణహిత నదిలో ఇన్ఫ్లో తగ్గింది. నీళ్లు ఎక్కువగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇటీవల ఆఫీసర్లు మోటార్లను బంద్ పెట్టారు. మొత్తంగా ఈ సీజన్లో 53 రోజులు మాత్రమే మోటార్లను నడిపించారు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ టార్గెట్ను అందుకోలేకపోయింది. ఏటా 225 టీఎంసీలు ఎత్తి పోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మళ్లీ ఉత్తదే అయింది. ఈ సీజన్లో 15 శాతం నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేదు.
100 టీఎంసీలు ఎక్కువగా లిఫ్ట్ చేస్తమని చెప్పి..!
గత సీజన్ కంటే ఈ సీజన్లో (2020 జూన్ నుంచి 2021 మే వరకు) దాదాపు100 టీఎంసీలు ఎక్కువగా గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తామని కొన్నాళ్ల కింద సర్కారు ప్రకటించింది. అయితే ఈ సీజన్లో చాలా ఆలస్యంగా ఎత్తిపోతలు చేపట్టారు. జనవరి 17న కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫీసర్లు నీటి ఎత్తిపోతలు ప్రారంభించగా.. మొత్తం 17 మోటార్లలో 7 మోటార్ల ద్వారా మార్చి 9 వరకు కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి 33 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి బంద్ పెట్టారు. ప్రాణహితలో నీళ్లు తగ్గడంతో 27 రోజుల కింద మోటార్లు బంద్పెట్టినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్లో ఎత్తిపోతలు 33 టీఎంసీలతోనే ఆగిపోయినట్లయింది.
ఆ నీళ్లు మూడు, నాలుగు లక్షల ఎకరాలకే
ఏటా 225 టీఎంసీలు ఎత్తిపోసి18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లిచ్చే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. ఇందుకోసం మొదట కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర 11 మోటార్లు ఏర్పాటు చేశారు. మూడో టీఎంసీ కోసం మరో ఆరు మోటార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అదనంగా రూ. 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర 17 మోటార్లకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసే కెపాసిటీ ఉన్నప్పటికీ, ఈ సీజన్లో కేవలం ఏడు మోటార్లను నడిపించారు. దీంతో వరద వచ్చిన రోజుల్లో 33 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్ చేయగలిగారు. ఈ నీళ్లు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు నీళ్లు అందక ఎండిపోతున్నాయి.
కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే
నిరుడు కాళేశ్వరం కింద కొత్తగా 12.71 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నా కొత్తగా ఒక్క ఎకరాకూ ఇవ్వలేకపోయింది. సర్కారు మాటలు నమ్మి పెండింగ్ప్రాజెక్టులు, కెనాల్స్ పూర్తవుతాయని, ఆయకట్టు చివరి భూములకూ నీళ్లొస్తాయని, చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆనందపడ్డారు. దీనికి తోడు భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతులు కాళేశ్వరం, దాని పరిధిలోని మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంల కింద, అటు మల్లన్నసాగర్ వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు లక్షలాది ఎకరాల్లో వివిధ పంటలు ముఖ్యంగా వరి సాగు చేశారు. కానీ పెండింగ్ రిజర్వాయర్లు పూర్తికాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గడం, కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్టింగ్ఆగడంతో రైతుల ఆశలకు బ్రేకులు పడ్డాయి. ఈ యాసంగిలో ఆయా ప్రాజెక్టుల కింద వారబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తుండడంతో చివరి ఆయకట్టు భూముల్లోని వరిపొలాలు ఎండిపోతున్నాయి.
రాష్ట్రానికే తలమానికం అని చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోని భూములకు కూడా సాగునీరు అందట్లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. లింక్‒1 కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. పంప్హౌస్లు కట్టారు. పనులు పూర్తయ్యాక భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలో 30 వేల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రకటించారు. పంపింగ్ మొదలై రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా ప్రభుత్వం నీళ్లివ్వలేదు.
డెడ్ స్టోరేజీ దగ్గర మేడిగడ్డ
మార్చి నెల ముగియక ముందే మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు అడుగంటిపోయాయి. 16.17 టీఎంసీల కెపాసిటీ గల దీంట్లో ప్రస్తుతం 2 టీఎంసీలే ఉన్నాయి. యాసంగి పంట చేతికి రావడానికి ఇంకా నెల రోజులకు పైగా పడుతుంది. ఈ టైంలోనే పంటలకు నీటి అవసరం ఎక్కువ. ఇలాంటి టైమ్లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీళ్లు లేకపోవడం, కాళేశ్వరం మోటార్లు బంద్ చేయడం ప్రాజెక్ట్ పనితీరును తేటతెల్లం చేస్తోంది. మార్చి నుంచి మే నెలాఖరు వరకు ప్రాణహితలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రోజూ వెయ్యి క్యూసెక్కుల నీళ్లే మేడిగడ్డకు చేరుతున్నాయి. ఈ కొద్దిపాటి నీటితో రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం అసాధ్యం. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందని సర్కార్ చెప్తున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని నిపుణులు అంటున్నారు.
కాళేశ్వరం కింద ప్రాజెక్టులవారీగా పరిస్థితి ఇదీ..
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి కెపాసిటీ 20.175 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 14.337 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో నుంచి డెయిలీ ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు 281 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇరిగేషన్ కోసం ఉన్న ఒకే ఒక్క గూడెం లిఫ్టు ద్వారా ప్రతి సీజన్లో 3 టీఎంసీలు ఎత్తిపోసి 30 వేల ఎకరాలకు సాగునీరివ్వాలనేది లక్ష్యం. కానీ ఈసారి 10 వేల ఎకరాలకు మించి నీళ్లు అందుతలేవు. దీంతో చివరి ఆయకట్టులో పొలాలు ఎండుతున్నాయి. తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఇరిగేషన్ఆఫీస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేర్ ప్రాజెక్టు కెపాసిటీ 27.5 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 15.49 టీఎంసీ ల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి వివిధ ప్యాకేజీల ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. కానీ అందులో సగానికి కూడా అందట్లేదు. ముఖ్యంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి, తిమ్మాపూర్, చిగురుమామిడి, మానకొండూర్, సైదాపూర్ మండలాల్లోని 70 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా, 53 వేల ఎకరాలకు అదీ వారబందీ పద్ధతిలో అందిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా బోయినిపల్లి, కొత్తపల్లి మండలాల్లోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా కేవలం 4 వేల ఎకరాలకు ఇస్తున్నారు. మానకొండూర్ మండలంలోని చెంజర్లలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తి కాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు పోవట్లేదు. సైదాపూర్ మండలంలో రైట్ కెనాల్ పనులు పూర్తయినా.. డిస్ట్రిబ్యూటరీలు కంప్లీట్ కాలేదు.
- ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కింద కూసు మంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 80,881 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఈ ఆయకట్టు టెయిలెండ్ గా ఉంది. గతంలో ఒకసారి అది కూడా దాదాపు పదేండ్ల కింద ట్రయల్ రన్ నిర్వహించగా, ఈ ఏడాది తొలిసారి కాల్వల ద్వారా జిల్లాకు 10 రోజులు నీళ్లు చేరాయి. ఆ తర్వాత బందయ్యాయి.
- సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 1.13 టీఎంసీ నీళ్లున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి కాకపోవడంతో దాదాపు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజక్టు పనులు పూర్తి కాకపోవడంతో దాదాపు 30 వేల ఎకరాలకు నీళ్లు అందట్లేదు. కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 8.02 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దాదాపు 15 వేల ఎకరాల్లో పంటలకు నీళ్లు అందడం లేదు. aభూగర్భనీటి మట్టాలు పెరిగేందుకు కొడకండ్ల వద్ద కొండపొచమ్మ సాగర్ ప్రధాన కాల్వ నుంచి నీటిని కూడవెల్లి వాగులోకి వదిలారు. దీని వల్ల దుబ్బాక నియోజకవర్గానికి కొంతమేరకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
- కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ) పూర్తి కెపాసిటీ 24.034టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.121 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. కాకతీయ కెనాల్ ద్వారా రోజూ 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కెనాల్ కింద కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లోని 9 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ కూడా వారబందీ అమలు చేస్తున్నారు. కానీ టెయిల్ఎండ్ భూములకు వాటర్ పూర్తిస్థాయిలో చేరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండీ ఎగువన నీటి విడుదల సరిగ్గా లేక చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 200 ఎకరాల్లో వరి పంట ఎండుతోంది. దీంతో ఇటీవల కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాల రైతులు రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు. రాగంపేట డిస్ట్రిబ్యూటరీకి నీటిని వదలక పొలాలు ఎండుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి నీటిని నిలిపివేయడంతో గంగాధర మండలం లోని పలు ఊళ్లలో 350 ఎకరాల్లో వరి పంట ఎండుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలం ఎండుతుంటే పాణం పోయినట్లయితంది
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు రాష్ట్ర మంతా పారిస్తమంటున్నరు. లింక్‒1 కింద 30 వేల ఎకరాలకు నీళ్లిస్తమన్నరు. ఒక్క ఎకరాకు కూడా అందుతలేవ్. మా ఏరియాల పండే పంటలకే నీళ్లిస్తలేరు. చెరువుల్లో నీళ్లు లెవ్వు. మా ఊర్లె 500 ఫీట్ల లోతుల బోర్లు వేసినా నీళ్తు పడ్తలేవ్. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్. ఎండిన పొలాన్ని చూస్తుంటే పాణం పోయినట్లయితంది.
- భానోత్ సారయ్య, అడ్వాలపల్లి, మల్హర్ మండలం, భూపాలపల్లి జిల్లా