ర్యాలంపాడు లీకేజీలకు రిపేర్లు చేస్తలే..ఫండ్స్​ రిలీజ్​ చేయట్లే

ర్యాలంపాడు లీకేజీలకు రిపేర్లు చేస్తలే..ఫండ్స్​ రిలీజ్​ చేయట్లే
  • పూర్తి స్థాయిలో నీటిని నింపితే ప్రమాదమని హెచ్చరించిన ఇంజనీర్ల బృందం
  • సగం ఆయకట్టుకే అందుతున్న సాగునీరు
  • సర్వేలకే పరిమితమవుతున్న ఆఫీసర్లు
  • నాలుగేండ్లుగా ఫండ్స్​ రిలీజ్​ చేయని సర్కారు

గద్వాల, వెలుగు:  నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌‌ను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. రిజర్వాయర్‌‌  కట్టకు బుంగలు పడి నీళ్లు లీక్‌  అవుతుండడంతో సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే అవకాశం లేకుండా పోతోంది. నాలుగేండ్ల క్రితమే లీకేజీలను గుర్తించినా, ఆఫీసర్లు రిపేర్లు చేయడంపై దృష్టి పెట్టడం లేదు. రైతుల ఆందోళనతో నిరుడు సర్వే చేసినా రిపేర్లు మాత్రం చేపట్టలేదు. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా.. ఒక టీఎంసీ డెడ్‌ స్టోరేజీకి పోయినా, 3 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండు టీఎంసీలకు మించి నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఈ సారి కూడా నిరాశ తప్పేలాలేదు.  

2019లో సీపేజీ గుర్తించినా..

నెట్టెంపాడు లిఫ్ట్​ను సర్కారు ముందు నుంచి చిన్నచూపు చూస్తోంది. కనీసం మెయింటెనెన్స్‌ కి డబ్బులు ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్‌ దెబ్బతింటున్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్‌‌ కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది. రైతులు నిరసనలు తెలపడంతో 2021లో రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్‌‌ను పరిశీలించింది. పూర్తిస్థాయిలో నీటిని నింపితే కట్టకు ప్రమాదం అని చెప్పి సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు.  దీంతో మూడేండ్ల నుంచి రెండు టీఎంసీల నీటినే నింపుతున్నారు. 

సర్వేకే ఏడాది..

రిటైర్ట్‌ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్లను పరిశీలించి వెళ్లిన అనంతరం లీకేజీల కంట్రోల్‌ కోసం ఇరిగేషన్‌ ఆఫీసర్లు చేపట్టిన సర్వేకే ఏడాది పట్టింది. సర్వే పనులను టెండర్‌‌ ద్వారా హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి గణేశ్‌ కంపెనీకి అప్పజెప్పగా బుంగలు ఎలా పడ్డాయి? ఎలా పూడ్చాలి? అనే అంశాలపై వారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్‌ను ఆఫీసర్లు డీడీవో(సెంట్రల్ డిజైన్‌ ఆఫీస్)కు ఫార్వర్డ్ చేశారు. దీన్ని పరిశీలించి క్లారిటీ ఇచ్చేందుకు మరో నాలుగు నెలలు పడుతుందని ఆఫీసర్లు తెలిపారు. రిపోర్ట్ వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు ఎలాంటి రిపేర్లు చేయడం లేదు. దాని గురించి అసలు ప్రస్తావనే తీసుకురాకపోవడంతో అసలు రిపేర్లు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిపోర్ట్  వచ్చినా..

రిజర్వాయర్ కట్టకు బుంగలు పడ్డాక ఇంజనీర్ల బృందం ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లో సర్కారు చెప్పింది. కట్టను మార్చాలా లేదా మళ్లీ కట్టను బలోపేతం చేయాలా అనే దానిపై క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. రిపోర్ట్ ఇచ్చాక కూడా రిపేర్లపై నిర్లక్ష్యం చేస్తున్నారు. 1.36 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రస్తుతం గట్టు మండలంలో నిర్మిస్తున్న గట్టు లిఫ్ట్ కు కూడా ర్యాలంపాడు రిజర్వాయర్  నుంచే నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అలాంటి రిజర్వాయర్ ను నిర్లక్ష్యం చేయడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సగం ఆయకట్టే..

నెట్టెంపాడు పరిధిలోని ఏడు రిజర్వాయర్లలో ర్యాలంపాడే పెద్దది.  నాలుగు టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించగా.. ఎత్తిపోతలు కావడంతో లెఫ్ట్  కెనాల్ 25 వేల ఎకరాలు, రైట్ కెనాల్ ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కానీ, ప్రస్తుతం రెండు టీఎంసీలే కావడంతో సగం ఆయకట్టుకు నీళ్లిచ్చేది అనుమానంగా మారుతోంది. చివరి ఆయకట్టు రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తమ పొలాలను పడావు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. 

నివేదిక పంపినం..

ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్  కింద ఉన్న ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నం. ప్రస్తుతం సర్వే కంప్లీట్ అయ్యింది. నివేదిక పంపించాం. సీడీవో ఆదేశాల మేరకు మేరకు రిపేర్లు చేస్తం. ఈసారి కూడా రెండు టీఎంసీలు నింపుతం. వరద వచ్చినప్పుడల్లా ఎత్తి పోస్తూ సాగు నీరిస్తం.  

- వెంకటేశ్వరరావు, ఈఈ, ర్యాలంపాడు ఇన్ చార్జి