- ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు
- 174 డ్యాములపైనా మానిటరింగ్ చేసేలా చర్యలు
- పైలెట్ ప్రాజెక్టుగా తొలి రెండేండ్లు ఐదింటిపై పర్యవేక్షణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్యాములు, బ్యారేజీల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందుకు తగ్గట్టుగా డ్యామ్ సేఫ్టీ కోసం చట్టం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు, ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్లు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో డ్యామ్ల సేఫ్టీ కోసం చట్టం తేవాలని సర్కారు భావిస్తున్నది. కావాల్సిన గైడ్లైన్స్ను ప్రిపేర్ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. స్టేట్ డ్యామ్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్ అండ్ సేఫ్టీ యాక్ట్ (ఎస్డీఎంఓఎస్ఏ) పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అది కాకపోతే వేరే పేరునూ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు దీనికి సంబంధించిన పూర్తి డ్రాఫ్ట్ను సిద్ధం చేసి పంపేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఎక్స్పర్ట్స్తో టీమ్
రాష్ట్రంలోని 174 డ్యాములు, బ్యారేజీల రక్షణ కోసం అన్నింటినీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. పైలెట్ప్రాజెక్టు కింద తొలి రెండేండ్లు ఐదు ప్రాజెక్టులను మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. ఆ ఫలితాలను బట్టి ఆ తర్వాత మిగతా అన్ని డ్యాములు, బ్యారేజీలనూ చట్టం కింద మానిటర్ చేస్తారని తెలిసింది. డ్యాముల మానిటరింగ్ కోసం 20 మందితో ఒక కోర్ టీమ్ను కూడా ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)పై పట్టున్న ఉన్నతాధికారులను కోర్టీమ్లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఎప్పటికప్పుడు ఫ్లడ్ అంచనాలు
డ్యాములు, బ్యారేజీల్లో ఎప్పటికప్పుడు వరదల అంచనాలను తెలుసుకునేలా సరికొత్త పద్ధతిని తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన నదులపై ఉన్న డ్యాములు, బ్యారేజీల ప్రాంతాల్లోని క్యాచ్మెంట్ ఏరియాలను ఓ గ్రిడ్గా చేసి అక్కడ కొన్నేండ్ల ఫ్లడ్ యావరేజ్ ఆధారంగా రియల్టైం ఫ్లడ్ అంచనాలను రూపొందించేందుకు చర్యలు చేపడ్తున్నట్లు తెలిసింది. అక్కడి నేల పరిస్థితులు, హైడ్రాలజీ అంశాలపైనా అప్టు డేట్ ఉండేలా చూసుకుంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగా ఓ సాఫ్ట్వేర్ ఆధారంగా మానిటర్ చేస్తారని తెలిసింది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలోనే చట్టం
ప్రస్తుతం జాతీయ స్థాయిలోనే డ్యాముల భద్రతపై చట్టం ఉంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను 2021లో కేంద్రం తీసుకొచ్చింది. దేశంలోని పది మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న డ్యాములు, బ్యారేజీల భద్రత, పర్యవేక్షణ, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి వాటిని ఈ చట్టం ద్వారా మానిటర్ చేస్తున్నారు. అయితే, రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేకంగా చట్టమంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఒక చట్టం తీసుకొస్తే డ్యాములు, బ్యారేజీలను పటిష్ఠంగా నిర్వహించొచ్చన్న ఆలోచనతోనే రాష్ట్ర సర్కారు దీనిపై వేగంగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మీడియం, మేజర్ డ్యాములతో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా చట్టంలో చేర్చొచ్చన్న ఉద్దేశంతో చట్టం కోసం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.