నారాయణపేట, వెలుగు: కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలుడిని కొందరు హిజ్రాలు పనిలో పెట్టిస్తామని నారాయణపేట జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. అతడికి చీర కట్టించి అడుక్కోవాలని చెప్పి, ఎంత సంపాదించాలో టార్గెట్పెట్టారు. అనుకున్నంత రాకపోవడంతో చిత్రహింసలకు గురి చేశారు. చివరకు అతడు తప్పించుకోవడంతో వారి బండారం బయటపడింది. నాలుగు రోజుల క్రితం కర్నాటకలోని బీదర్ జిల్లాకు చెందిన 16 ఏండ్ల అబ్బాయి ఆడ గొంతుతో మాట్లాడడాన్ని కొందరు హిజ్రాలు గుర్తించారు. అతడిని రెగ్జిన్వర్క్లో పెట్టించి దారికి తెస్తామని వారి తల్లిందండ్రులకు చెప్పి నారాయణపేటకు తీసుకువచ్చారు.
అయితే అడుక్కోవాలని కోరడంతో ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. దీంతో మూడు రోజుల క్రితం సంతోష్ అనే వ్యక్తి సహాయంతో ఓ రూంలో బంధించి చిత్రహింసలు పెట్టారు. మంగళవారం చీర కట్టించి తాము చెప్పిన మొత్తాన్ని అడుక్కొని తేవాలని హెచ్చరించి పంపారు. వాళ్లన్నట్టే చేసినా టార్గెట్పెట్టిన డబ్బులు రాలేదు. దీంతో రాత్రి అతడిని చితకబాదారు. బుధవారం వారి నుంచి తప్పించుకున్న బాలుడు సత్యసాయి కాలనీలోని ఓ దవాఖానా వద్ద ఏడుస్తుండగా కొందరు చూసి చైల్డ్లైన్కు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు పోలీసుల సాయంతో చైల్డ్లైన్ ఆఫీసుకు తీసుకువచ్చి వివరాలు కనుక్కున్నారు. అబ్బాయికి కేవలం కన్నడ మాత్రమే రావడంతో ఆ భాష తెలిసిన వారితో మాట్లాడించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే షాక్లో ఉన్న ఆ అబ్బాయి ‘నన్ను కొట్టొద్దు. వెంటనే బీదర్లో ఉన్న అమ్మనాన్న దగ్గరికి చేర్చండి’ అంటూ ఏడ్చాడు. మెల్లి మెల్లిగా అన్ని విషయాలు చెప్పాడు. కాగా, 8 మంది సభ్యులున్న హిజ్రాల ముఠా ఒకటి 2 నెలల ఒప్పందం చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి చిన్నపిల్లలను తీసుకువచ్చి నారాయణపేటతో పాటు, బార్డర్లోని కర్నాటక ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై డీసీపీఓ కుసుమలతను వివరణ కోరగా తమ దగ్గరున్న పిల్లవాడి తల్లిదండ్రులు బీదర్లో ఉంటారని తెలిసిందని, అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు కనుక్కుంటామన్నారు.