- సభలో అర్ధరాత్రి ఓటింగ్.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి
ఇస్లామాబాద్: శనివారం అర్ధరాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఓటమి పాలైంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి వరకూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహణను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విదేశీ కుట్రలో పాలుపంచుకోలేమంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్యానల్ స్పీకర్ అయాజ్ సాధిక్ ఓటింగ్ నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాసానికి సభ మద్దతు లభించిందని ప్యానల్ స్పీకర్ ప్రకటించారు. కొత్త ప్రధానిగా పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.
అర్ధరాత్రి దాకా హైడ్రామా
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం నేషనల్ అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. ఓటింగ్ పెట్టేందుకు చివరి నిమిషం వరకూ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ససేమీరా అంది. తొలుత ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల కుట్రపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేసింది. చర్చకు అంగీకరించని ప్రతిపక్షాలు అవిశ్వాసంపై ఓటింగ్ పెట్టాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళం చెలరేగి పలుమార్లు వాయిదా పడింది.
రోజంతా టెన్షన్.. టెన్షన్..
అవిశ్వాసంపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని, నేషనల్అసెంబ్లీని రద్దుచేస్తూ ప్రెసిడెంట్ఇచ్చిన ఆదేశాలను పాకిస్తాన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. నేషనల్ అసెంబ్లీ రద్దు చెల్లదని ప్రకటించిన న్యాయస్థానం.. శనివారం అవిశ్వాసంపై ఓటింగ్ పెట్టాలని స్పీకర్ అసద్ ఖైసర్ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10.30 గంటలకు నేషనల్ అసెంబ్లీ ప్రారంభమైంది. సభకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాలేదు. సభ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాసంపై ఓటింగ్ పెట్టాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. స్పీకర్ అసద్ ఖైసర్ మాత్రం విదేశీ కుట్రపై చర్చ చేపడతామని ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు ఇమ్రాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ అర్ధరాత్రి వరకూ వాయిదాలపై వాయిదాలు పడుతూ సాగింది. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో మేజారిటీ దక్కాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ మిత్రపక్షాలు గుడ్బై చెప్పడంతో ఇమ్రాన్ సర్కారు మైనార్టీలో పడింది. పీటీఐ పార్టీ మీటింగ్కు 98 మంది మాత్రమే హాజరయ్యారు. 22 మంది తిరుగుబాటుదారులు ఇమ్రాన్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇమ్రాన్ను గద్దె దించడానికి అవసరమైన మెజారిటీ తమకుందని
పీపీపీ పార్టీ చెప్పింది.
రంగంలోకి ఆర్మీ బలగాలు
శనివారం రాత్రి ఇమ్రాన్ఖాన్ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ఇమ్రాన్ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. చివరికి రాత్రి 10 గంటల తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీలోని తన చాంబర్కు చేరుకున్నారు. అంతకు ముందు ప్రధాని నివాసంలో ఇమ్రాన్తో స్పీకర్ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చలు జరిపా రు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ వెలుపలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మీ బలగాలు భారీ సంఖ్యలో ఇస్లామాబాద్లో మోహరించాయి. ఇస్లామాబాద్, లాహోర్ తదితర నగరాల్లో ఇమ్రాన్కు అనుకూల, వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. మరోవైపు చివరి నిమిషం వరకూ అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించకపోవడంతో అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు అత్యవసరంగా సమావేశమైంది. తమ ఆదేశాలను స్పీకర్ పాటించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద విచారణ జరిపింది. కాగా, అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్న డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో
రివ్యూ పిటిషన్ వేసింది.