ఇక మెరుపులే.. మరో 9 రోజుల్లో ఐపీఎల్ 14

ఇక మెరుపులే.. మరో 9 రోజుల్లో ఐపీఎల్ 14

ఘన చరిత్ర ఉన్న చెన్నై సూపర్​ కింగ్స్​ తడబాటు.. అంచనాలే లేని ఢిల్లీ క్యాపిటల్స్‌‌ అద్భుత పెర్ఫామెన్స్‌‌.. తిరుగులేని ఆటతో  ముంబై ఇండియన్స్‌‌ ఐదోసారి టైటిల్‌‌ దక్కించుకున్న క్షణాలు.. ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి..!  కరోనా కారణంగా జరుగుతుందో లేదో అనుకున్న 13వ ఎడిషన్‌‌ యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌ గడ్డపై అందించిన వినోదాన్ని మరచిపోకముందే  ఐపీఎల్‌‌ హంగామా మళ్లీ మొదలైంది..!  ఆరు నెలలు తిరగకుండానే  క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు కిక్ ఇచ్చేందుకు మెగా లీగ్‌‌ మళ్లీ ముస్తాబైంది..!  మొన్నటిదాకా నేషనల్‌‌ డ్యూటీలో నిమగ్నమైన ఇండియా స్టార్స్‌‌.. ఇప్పుడు తమ ఫ్రాంచైజీల జెర్సీలు  ధరించి టీమ్‌‌మేట్స్‌‌తోనే అమీతుమీకి రెడీ అవుతున్నారు..!  ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ పద్నాలుగో ఎడిషన్‌‌ మరో తొమ్మిది రోజుల్లోనే  మన ముందుకు రాబోతోంది..!  కరోనా కారణంగా  ఖాళీ స్టేడియాల్లో జరగనున్న మెగా లీగ్‌‌ మెరుపులను ఈసారి కూడా ‘తెర’పై చూడాల్సిందే..!

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌)
క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు, ఐపీఎల్‌‌ను ఇష్టపడే వాళ్లకు డబుల్‌‌ బొనాంజా.  ఏడాది కాలంలో  రెండుసార్లు మెగా లీగ్​  ప్రేక్షకుల ముందుకొస్తోంది. కరోనా కారణంగా గతేడాది చలికాలంలో ఎడారి దేశంలో  అలరించిన లీగ్​ మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. ఎప్పట్లాగే వేసవిలో వినోదాల విందు  పంచబోతోంది. ఏప్రిల్​9న ముంబై ఇండియన్స్​–రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు మధ్య ఫస్ట్‌‌ వార్‌‌తో మొదలయ్యే పద్నాలుగో ఎడిషన్‌‌..  మే 30న వరల్డ్‌‌ లార్జెస్ట్‌‌  మొతెరా స్టేడియంలో జరిగే ఫైనల్‌‌తో ముగుస్తుంది. వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్ల చేరికతో పాటు  టోర్నీ ఫార్మాట్‌‌ మారబోతోంది. దాంతో, ఎనిమిది జట్ల డబుల్‌‌ రౌండ్‌‌ రాబిన్‌‌–ప్లే ఆఫ్స్‌‌ ఈ సారే ఆఖరు కానుంది. ఇక,  కరోనా కారణంగా ఆరు వేదికలకే పరిమితమైన లీగ్‌‌లో అన్ని జట్లూ హోమ్‌‌ అడ్వాంటేజ్‌‌ కోల్పోయాయి.  ప్రతీ టీమ్‌‌ న్యూట్రల్‌‌ వెన్యూలోనే ఆడనుంది. కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ తమ పేరును పంజాబ్‌‌ కింగ్స్‌‌గా మార్చుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ను తమ కొత్త కెప్టెన్‌‌గా ఎంచుకుంది. అలాగే, ఆక్షన్‌‌లో  పలువురు స్టార్‌‌ ప్లేయర్లు ఫ్రాంచైజీలు మారారు. ఇక, ఈ సీజన్‌‌ కోసం బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్‌‌ ప్రవేశపెట్టింది. సో.. ఆరు నెలల్లోనే మళ్లీ పలుకరిస్తున్నప్పటికీ.. కొత్త సీజన్‌‌ సరికొత్తగా జరగడం పక్కా అనిపిస్తోంది.

బబుల్‌‌ టు బబుల్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌..  

ఐపీఎల్​ కోసం గతేడాది మాదిరిగా బీసీసీఐ పటిష్టమైన బయో బబుల్‌‌ను క్రియేట్‌‌ చేసింది. అయితే, ఇప్పటికే తమ నేషనల్‌‌ టీమ్స్‌‌ బయోబబుల్స్‌‌లో ఉండి ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ ఆడుతున్న ప్లేయర్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. సదరు ప్లేయర్లు తమ టీమ్‌‌ బబుల్‌‌ నుంచి నేరుగా ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ బబుల్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యేందుకు అనుమతించింది. దీనివల్ల మళ్లీ వారం రోజుల క్వారంటైన్‌‌లో ఉండాల్సిన పని తప్పింది. దాంతో, వన్డే సిరీస్‌‌ను ముగించుకున్న ఇండియా, ఇంగ్లండ్‌‌ ప్లేయర్లు నేరుగా తమ టీమ్‌‌ క్యాంప్‌‌ల్లో  చేరిపోయారు. పాకిస్తాన్‌‌తో సిరీస్‌‌లో పాల్గొనే సౌతాఫ్రికా ప్లేయర్లకు కూడా ఈ సడలింపులు వర్తిస్తాయి. ఈ సీజన్‌‌ కోసం మొత్తం 12 బయో బబుల్స్‌‌ క్రియేట్‌‌ చేశారు.  ఎనిమిది ఫ్రాంచైజీల ప్లేయర్లు సఫోర్ట్‌‌ స్టాఫ్‌‌కు ఒక్కోటి, మ్యాచ్‌‌ అఫీషియల్స్‌‌, మ్యాచ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ టీమ్స్‌‌కు  రెండు వేర్వేరు బబుల్స్‌‌, బ్రాడ్‌‌కాస్ట్‌‌ కామెంటేటర్లు, సిబ్బంది కోసం ఇంకో రెండు బబుల్స్‌‌ ఏర్పాటు చేశారు. 

 ప్లేయర్లకు నో వ్యాక్సినేషన్‌‌

ఇండియాతో పాటు అన్ని దేశాల్లో  వ్యాక్సినేషన్‌‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో  ఇండియా క్రికెటర్లకు వ్యాక్సిన్‌‌ ఇస్తారన్న వార్తలు వచ్చాయి.  లీగ్‌‌లో పాల్గొనే అందరికీ వ్యాక్సినేషన్‌‌ ప్రోగామ్‌‌ ఏర్పాట్లు చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని బీసీసీఐ చెప్పింది.

చెన్నై వైస్‌‌ కెప్టెన్సీ ఎవరికి?

గతేడాది చెత్తగా ఆడిన సీఎస్​కే ఈసారి ఎలాగైనా మంచి పెర్ఫామెన్స్‌‌ ఇవ్వాలని చూస్తోంది. అందరికంటే ముందు ప్రిపరేషన్స్‌‌ స్టార్ట్‌‌ చేసింది. అయితే, చెన్నై క్యాంప్‌‌లో  రైనా, రవీంద్ర జడేజా కనిపించకపోవడంతో వారిద్దరూ  ఆడుతారో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ, ఇద్దరూ ముంబైలో టీమ్‌‌తో కలిశారు. ఈ సీజన్‌‌ కోసం రైనా చాన్నాళ్ల నుంచి ప్రైవేట్‌‌గా ప్రాక్టీస్‌‌ చేస్తున్నాడు. ఆసీస్‌‌ టూర్‌‌లో అయిన గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా గ్రౌండ్‌‌లోకి వచ్చేశాడు. అయితే, 14వ సీజన్‌‌లో సీఎస్‌‌కే టీమ్‌‌కు వైస్‌‌ కెప్టెన్‌‌ ఎవరన్నదానిపై సస్పెన్స్‌‌ కొనసాగుతోంది. ఫస్ట్‌‌ సీజన్‌‌ నుంచి రైనా వైస్‌‌ కెప్టెన్‌‌గా ఉన్నాడు. ఈసారి  రైనా ప్లేస్​లో జడేజాకు వైస్​ కెప్టెన్సీ దక్కే చాన్సెస్​ ఉన్నాయి.  

కొత్త జెర్సీతో పంజాబ్​

పంజాబ్‌‌ కింగ్స్‌‌గా పేరు మార్చుకున్న కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌  కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది.  ఈ సీజన్‌‌ కోసం ఉపయోగించే న్యూ జెర్సీని మంగళవారం అన్‌‌వీల్‌‌ చేసింది. తమ ప్రైమరీ  కలర్‌‌ అయిన ఎరుపు రంగునే కొనసాగించినప్పటికీ.. గోల్డెన్‌‌ కలర్‌‌ స్ట్రిప్స్‌‌ను ఎడ్జెస్‌‌పై కొత్తగా యాడ్‌‌ చేశారు. ఈ సీజన్​ కోసం రూపొందించిన కొత్త జెర్సీలను చెన్నై, ముంబై ఇప్పటికే అన్​వీల్​ చేశాయి. కాగా, ఆస్ట్రేలియాతో ఫస్ట్‌‌ టెస్టులో గాయపడ్డ     పేసర్​ షమీ కోలుకొని పంజాబ్​ టీమ్​తో కలిశాడు. ​


కొత్త రూల్స్‌‌..

  • ఈ సీజన్‌‌ కోసం బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్‌‌ ప్రవేశపెట్టింది. వివాదాస్పదంగా మారిన  సాఫ్ట్‌‌ సిగ్నల్‌‌, షార్ట్‌‌ రన్‌‌, నో బాల్స్‌‌ విషయంలో  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి కొత్త రూల్స్‌‌ ఏంటంటే..
  • మ్యాచ్‌‌ టైమింగ్‌‌ను పక్కాగా అమలు చేస్తారు. ప్రతీ ఇన్నింగ్స్‌‌ 90 నిమిషాల్లో ముగియాలన్న రూల్‌‌ పెట్టారు. ఇప్పటిదాకా 20వ ఓవర్‌‌ 90వ నిమిషం లేదా అంతకంటే ముందు స్టార్ట్‌‌ అవ్వాల్సి ఉండేది. ఈ సారి మాత్రం మొత్తం ఓవర్లను గంటన్నరలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులోనే   ఐదు నిమిషాలు టైమ్‌‌ ఔట్‌‌ ఉంటుంది. వర్షం లేదా ఇతర కారణాలతో ఆటకు అంతరాయం కలిగి ఓవర్లను కుదిస్తే.. 4 నిమిషాల 15 సెకండ్లకు ఒక ఓవర్‌‌ వేయాల్సి ఉంటుంది.
  • మ్యాచ్‌‌లో  సందేహాస్పద నిర్ణయాలను థర్డ్‌‌ అంపైర్‌‌కు రిఫర్‌‌ చేసే టైమ్‌‌లో  ఫీల్డ్‌‌ అంపైర్లు చెప్పే సాఫ్ట్‌‌ సిగ్నల్‌‌ను రద్దు చేశారు. రీప్లేలు చూశాక థర్డ్‌‌ అంపైర్‌‌ ఇచ్చే నిర్ణయమే ఫైనల్‌‌ అవుతుంది.  
  • షార్ట్‌‌ రన్‌‌పై నిర్ణయం  థర్డ్‌‌ అంపైర్‌‌కే అప్పగించారు.  బ్యాట్స్‌‌మన్‌‌  రన్స్‌‌ తీసే టైమ్‌‌లో  తన బ్యాటును క్రీజులో పెట్టాడో లేదో గుర్తించే పని ఇకపై టీవీ అంపైర్‌‌దే. 
  • ఫుట్‌‌ నో బాల్స్‌‌తో పాటు అన్ని రకాల నోబాల్స్‌‌ను గుర్తించే బాధ్యత ఈ సీజన్‌‌లో టీవీ అంపైర్‌‌కే కట్టబెట్టారు. 
  • మ్యాచ్‌‌తో పాటు సూపర్‌‌ ఓవర్‌‌ టై అయితే రిజల్ట్‌‌ వచ్చే వరకూ సూపర్‌‌ ఓవర్లు ఆడించాలన్న రూల్‌‌లో మార్పులు చేశారు. దానికి కూడా టైమ్‌‌ లిమిట్‌‌ పెట్టారు. ఇకపై మ్యాచ్‌‌ ముగిసిన (సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో లాస్ట్‌‌ బాల్‌‌ పడ్డాక) గంటలోపు సూపర్‌‌ ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.