లివర్‌‌ ఖరాబైతంది

లివర్‌‌ ఖరాబైతంది

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో హెపటైటిస్‌‌ వైరస్ విస్తరిస్తోంది. దీంతో ఈ వ్యాధి బాధితులను లెక్కించాలని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్ణయించింది. ఈ మేరకు హెపటైటిస్‌‌ పేషెంట్స్ (లివర్‌‌ వ్యాధి) ఎక్కువగా నమోదవుతున్న గద్వాల జిల్లాలో స్ర్కీనింగ్‌‌ పైలెట్ ప్రాజెక్ట్‌‌ చేపడుతోంది. ఈ జిల్లా పరిధిలోని యడపిన్నె, పర్దీపూర్, పచ్చర్ల, చిన్న దన్వాడ గ్రామాల్లో దాదాపు 25% మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ గ్రామాల్లో సుమారు10 వేల మందికి హెల్త్‌‌ టెస్టులు చేయనున్నారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండడంతో స్ర్కీనింగ్‌‌లో పాల్గొనే హెల్త్‌‌ సిబ్బందికి ఇప్పటికే తొలి విడత వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్‌‌‌‌ ఫస్ట్‌‌ వీక్‌‌లో రెండో విడత వ్యాక్సిన్ ఇచ్చి, అదే నెల 10 నుంచి స్ర్కీనింగ్ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ స్ర్కీనింగ్‌‌కు అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్ర్కీనింగ్‌‌లో రోగం ఉన్నట్టు తేలిన వాళ్లకు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌‌తో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ ఇస్తారు. హెపటైటిస్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ చాలా ఖరీదు. కనీసం  ఏడాది, పేషెంట్ కండీషన్‌‌ను బట్టి 24 నెలల వరకూ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. 12 నెలలకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

కేన్సర్ ముప్పు

ఇటీవల రాష్ట్రంలో ‘హెపటైటిస్‌‌ సీ’ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గతంలో సీనియర్ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్‌‌ డాక్టర్ సోమశేఖర్ చేసిన సర్వేలోనూ ఇదే విషయం తేలింది. ఇక ‘బీ’ వైరస్ కేసులూ ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది హెపటైటిస్‌‌ బీ వైరస్‌‌తో బాధపడుతున్నట్టు  అంచనా. ఈ వైరస్‌‌ ప్రమాదకరం. కలుషిత రక్తం. సిరంజ్‌‌లు, సూదులు వాడటం, రక్షణ లేని లైంగిక చర్యల వల్ల ఇది సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు పైకి కన్పించకపోవడంతో 50 నుంచి 60% కేసుల్లో లివర్‌‌ దెబ్బ తిన్నాకే పేషెంట్లు తమ వద్దకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో 20% మంది కాలేయం పూర్తిగా దెబ్బతిని (లివర్‌‌సిర్రోసిస్‌‌) పని చేయకుండా పోతోందంటున్నారు. ఇక హెపటైటిస్‌‌ బీ వైరస్‌‌ సోకినవాళ్లలో 10 నుంచి 20% మందికి లివర్ కేన్సర్ ముప్పు ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా డయాలసిస్‌‌, తలసేమియా, హెచ్‌‌ఐవీ, టీబీ పేషెంట్లు, గర్భిణులకు హెపటైటిస్‌‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

దేశంలో 5.2 కోట్ల మంది పేషెంట్లు

రాష్ట్ర జనాభాలో 2 నుంచి 3% మంది కాలేయ జబ్బులతో బాధపడుతున్నట్టు అంచనా.
ఇక దేశంలో 5.2 కోట్ల మంది హెపటైటిస్‌‌‌‌‌‌‌‌ రోగులున్నట్టు సెంట్రల్ హెల్త్‌‌ మినిస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.
వైరల్ హెపటైటిస్ బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో దాని నిర్మూలనకు కేంద్రం ఇటీవల చర్యలు ప్రారంభించింది.
అరక్షిత సెక్స్‌‌, షుగర్‌‌ పేషెంట్లు, మితిమీరిన ఆల్కహాల్‌‌ తీసుకోవడం, కలుషిత నీరు, ఆహారంతో కాలేయ వ్యాధి బాధితులుగా మారుతున్నారు.
హెపటైటిస్‌‌‌‌‌‌‌‌లో ఏ, బీ, సీ, డీ, ఈ రకాలున్నాయి. ఏ, ఈ వైరస్‌‌లు కలుషిత ఆహారం, నీటి ద్వారా వస్తుండగా, బీ, సీ వైరస్‌‌లు లైంగిక చర్యల వల్ల సోకుతున్నాయి. వైరస్‌‌ ఉన్నవాళ్లు వాడిన సూదులు, బ్లేడ్‌‌లు వాడడం వల్ల, రక్తమార్పిడితోనూ సంక్రమిస్తున్నాయి.