రూ.2 వేల నోటు వద్దన్న పెట్రోల్ బంకు.. కేసు పెట్టిన కస్టమర్

రూ.2 వేల నోటు వద్దన్న పెట్రోల్ బంకు.. కేసు పెట్టిన కస్టమర్

పెట్రోల్ బంకులో 2 వేల నోటు తీసుకోలేదని బంకు సిబ్బందిపై ఫిర్యాదు చేశాడో వాహనదారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. 

ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1లోని పెట్రోల్ బంకుకు వెళ్లాడో వ్యక్తి. 400 రూపాయల పెట్రోల్ ను తన వాహనంలో పోయించుకుని.. రూ.2 వేల నోటు ఇచ్చాడు. దీంతో బంకు సిబ్బంది రూ.2 వేల నోటును తీసుకోవడానికి నిరాకరించాడు. తన వద్ద చిల్లర లేదంటూ వాదించాడు. ఇలా చాలాసేపు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 

చివరకు సదరు బాధితుడు కోట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి బంకు సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. తాను ఇచ్చిన రూ.2వేల నోటును బంకు సిబ్బంది తీసుకోవడం లేదని కంప్లైంట్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90 శాతం నోట్లు ఆర్బీఐకి చేరాయి. అయితే చలామణిలో కేవలం 10 శాతం నోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజలు రూ.2000 నోట్లతో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. షాపింగులకు ఎక్కువగా రూ. 2000 నోట్లను వినియోగిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొందరు రూ. 2000 నోట్లు ఇచ్చి పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నారు. అయితే కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం రూ. 2000 నోట్లను తీసుకోవడం లేదని ఫిర్యాదు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇటీవల ఆర్భీఐ కూడా స్పందించింది. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.