
న్యూఢిల్లీ: మనదేశంలో సంపద వేగంగా పెరుగుతున్నట్టు వెల్లడయింది. 2021లో 4.58 లక్షలుగా ఉన్న మిలియనీర్ల కుటుంబాల సంఖ్య (నికర విలువ కనీసం రూ. 8.5 కోట్లు) 2025 నాటికి 90 శాతం పెరిగి 8.71 లక్షలకు చేరింది. మెర్సిడెస్ -బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ఈ వివరాలను వెల్లడి చేసింది.
రిపోర్ట్ ప్రకారం..దేశంలో అత్యధికంగా ముంబైలో 1.42 లక్షల మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయి. దీని తర్వాత ఢిల్లీ (68,200), బెంగళూరు (31,600) ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే, 1.78 లక్షల మిలియనీర్ కుటుంబాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర జీఎస్డీపీలో 55 శాతం పెరుగుదల దీనికి మద్దతు ఇస్తోంది.
మెర్సిడెస్- బెంజ్ అమ్మకాలు, కొత్త బిలియనీర్ల సంఖ్య, సెన్సెక్స్ పనితీరు, జీడీపీని కలిపి రూపొందించిన ఎంబీహెచ్ఎక్స్ దాదాపు 200 శాతం పెరిగింది. ఇది ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా సంపద వృద్ధి చెందుతోందని సూచిస్తోంది. దాదాపు 35 శాతం మంది మిలియనీర్లు డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ యాప్లను ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు.
బ్రాండ్ల విషయానికి వస్తే.. రోలెక్స్, తనిష్క్, ఎమిరేట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొదటి స్థానంలో ఉన్నాయని హురున్ ఇండియా ఫౌండర్, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. మెర్సిడెస్- బెంజ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఇండెక్స్ భారతదేశంలోని సంపన్న వర్గాల స్థితిగతులు, లగ్జరీ వస్తువుల వినియోగంలో వస్తున్న మార్పులను చూపిస్తుందని తెలిపారు.