న్యూఢిల్లీ: దేశంలో మిలియనీర్ల ( రూ. 8 కోట్లు కంటే ఎక్కువ సంపద ఉన్నవారి) సంఖ్య 2030 నాటికి 60 లక్షలకు చేరుకుంటుందని మీడియా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. ఇదే టైమ్లో చైనాలో మిలియనీర్ల సంఖ్య 5 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. ఇంకో ఎనిమిదేళ్లలో దేశంలోని మిలియనీర్ల సంఖ్య పెద్దవారిలో సుమారు ఒక శాతానికి చేరుకుంటుందని హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఆసియా– పసిఫిక్ రీజియన్లోని సంపన్నుల గురించి ఈ సంస్థ రిపోర్ట్ విడుదల చేసింది. ఇంకో ఎనిమిదేళ్లలో సింగపూర్ జనాభాలో ఎక్కువ మంది మిలియనీర్లుగా మారతారని, ఈ విషయంలో ఆస్ట్రేలియాను ఈ దేశం దాటేస్తుందని అంచనావేసింది.
కిందటేడాది నాటికి సింగపూర్ జనాభాలో 7.5 % మంది సంపద కనీసం 1.38 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు) గా ఉంది. 2025 నాటికి ఈ దేశ జనాభాలో 9.8 % మంది మిలియనీర్లు ఉంటారని, 2030 నాటికి ఈ వాటా13.4 శాతానికి పెరుగుతుందని హెచ్ఎస్బీసీ రిపోర్ట్ వెల్లడించింది. కిందటేడాది ఆస్ట్రేలియా జనాభాలో 8 % మంది మిలియనీర్లు ఉన్నారు. 2030 నాటికి ఆయా దేశ జనాభాలో ఎక్కువ మంది మిలియనీర్లు కలిగిన దేశంగా సింగపూర్ మొదటి ప్లేస్కి చేరుకుంటుందని, ఆస్ట్రేలియా రెండో ప్లేస్కు దిగిపోతుందని హెఎస్బీసీ రిపోర్ట్ పేర్కొంది.
జనాభాలో మిలియనీర్ల వాటాను పరిగణనలోకి తీసుకుంటే మన దేశం (0.6 %) కంటే ముందు ఇండోనేషియా (0.9%), వియత్నాం (ఒక శాతం), థాయ్ల్యాండ్ (2 %), మలేషియా (4.3 %) వంటి ఆసియా దేశాలు ఉన్నాయి. మిలియనీర్ల సంపదను లెక్కించడంలో బ్యాంకుల్లోని క్యాష్, స్టాక్స్, బాండ్లలోని ఇన్వెస్ట్మెంట్లను, రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ను హెచ్ఎస్బీసీ రెడీ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇంకో ఎనిమిదేళ్లలో జనాభాలో 12.5% మిలియనీర్లతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్లో ఉంటుంది. ఇదే టైమ్కి జనాభాలో 11.1 % మిలియనీర్లతో హాంకాంగ్ మూడో ప్లేస్లో, 10.2% మిలియనీర్లతో తైవాన్ నాల్గో ప్లేస్లో ఉంటాయి. 2030 నాటికి యూఎస్లో జనాభాలో 9 % మంది మిలియనీర్లు, జపాన్ జనాభాలో 7.2 % మిలియనీర్లు, చైనా జనాభాలో 4.4 % మిలియనీ ఉంటారు. దేశంలో మిలియనీర్లు పెరిగినా, జనాభాలోని వీరి వాటా కేవలం 0.6 శాతమే ఉంటుందని హెచ్ఎస్బీసీ రిపోర్ట్ వెల్లడించింది.
యూఎస్ కంటే ఎక్కువ..
ఆసియా దేశాల్లో మిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఈ రిపోర్ట్ అంచనావేసింది. 2035 నాటికి జనాభాలో 17 శాతం మిలియనీర్ల వాటాతో సింగపూర్ టాప్లో కొనసాగుతుందని, 15.1 శాతం మిలియనీర్లతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్లో, 14.6 శాతం మిలియనీర్లతో హాంకాంగ్ మూడో ప్లేస్లో ఉంటాయని వివరించింది. ఆసియాలో సంపన్నులు పెరుగుతారని, లక్షల మంది పేదరికం నుంచి బయటపడడానికి అవకాశాలు పెరుగుతాయని హెచ్ఎస్బీసీ చీఫ్ ఆసియా ఎకనామిస్ట్ ఫ్రెడ్రిక్ న్యూమన్ ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆసియా–పసిఫిక్ రీజియన్లో ధనవంతులు, పేదవారి మధ్య ఆర్థికపరమైన అంతరం ఉన్నప్పటికీ, ఈ రీజియన్లో క్యాపిటల్కు ఎటువంటి ఢోకా ఉండబోదని అభిప్రాయపడ్డారు.
2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత నుంచి ఆసియాలో సంపద సృష్టి ఊపందుకుందని, 2030 నాటికి ఆసియాలో సంపద 140 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనావేశారు. అప్పటికి యూఎస్ వెల్త్ 120 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కించారు. ఆసియా–పసిఫిక్ రీజియన్లోని సంపదలో సగం వాటా జపాన్ నుంచి వస్తుందని అంచనావేశారు. కాగా, కిందటేడాది నాటికి ఆసియా–పసిఫిక్ దేశాల సంపదలో చైనా వాటా 46 శాతానికి పెరగగా, జపాన్ వాటా25 శాతానికి తగ్గింది. అదే జపాన్ సంపదను ఈ రీజియన్ నుంచి పక్కకి పెడితే, మిగిలిన దేశాల ఆర్థిక సంపద 100 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనావేసింది. ప్రస్తుత ట్రెండ్స్ను బట్టి చూస్తే జపాన్ను మినహాయించిన ఆసియా–పసిఫిక్ దేశాల పెర్ క్యాపిటా ఇన్కమ్ 2025 నాటికే యూఎస్ను దాటేస్తుందని న్యూమన్ అభిప్రాయపడ్డారు.