చెన్నూరుపై కాంగ్రెస్​ నజర్..​ టికెట్​ కోసం పెరుగుతున్న ఆశావాహులు

చెన్నూరుపై కాంగ్రెస్​ నజర్..​ టికెట్​ కోసం పెరుగుతున్న ఆశావాహులు
  •     ఇద్దరు మాజీలు..  డాక్టర్లు
  •     స్థానికత..  సామాజిక వర్గం
  •     ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ముందస్తు ప్రచారం
  •     సామాజిక కార్యక్రమాలే ఆయుధం
  •     బీఆర్​ఎస్​ను ఓడించడమే టార్గెట్​​

కోల్​బెల్ట్​, వెలుగు : ఎస్సీ రిజర్వ్‌ డ్  నియోజకవర్గమైన చెన్నూరులో కాంగ్రెస్​ టికెట్‌ కోరుతున్న వారి  సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన లీడర్లతో పాటు పలువురు సెకండ్​క్యాడర్​ లీడర్లు, రెడీ అవుతున్నారు.   ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు.    

      చెన్నూరులో ఎలాగైనా గెలవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.  అనూహ్యంగా ఓదెలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.  టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవ రావుతో పాటు సీనియర్​ లీడర్  సోత్కు సుదర్శన్, డాక్టర్​ దాసారపు శ్రీనివాస్​ ఉన్నారు.  కాంగ్రెస్​ నుంచి నూకల రమేశ్​పేరును మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు అధిష్టానం పెద్దల వద్దకు తీసుకెళ్లారు.  సింగరేణి డాక్టర్​రాజా రమేశ్ వృత్తికి రాజీనామా చేసి ఖమ్మంలో రాహుల్​గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు.  

మంచిర్యాలకు చెందిన రియల్టర్​ దుర్గం అశోక్, సింగరేణి డిస్మిస్​ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న  రామిల్ల రాధిక,  బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరిన  దుర్గం నరేశ్​తో పాటు  సింగరేణి ఉద్యోగులు, కుల సంఘాల బాధ్యులు మరికొందరు కాంగ్రెస్  టికెట్​ఆశిస్తున్నారు. సింగరేణి డాక్టర్​ రాజారమేశ్, దుర్గం అశోక్,  డాక్టర్​దాసారాపు  శ్రీనివాస్ ​​జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.   కొన్ని నెలలుగా మందమర్రికి చెందిన పీసీసీ మెంబర్​నూకల రమేశ్​నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. 

సామాజిక వర్గంపై ఆశలు…

చెన్నూరులో మొదటి నుంచి మాల, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలుపొందుతున్నారు.  కాంగ్రెస్ గత ఎన్నికల్లో నేతకాని కులస్తుడైన బోర్లకుంట వెంకటేశ్​నేతకు టికెట్​ కేటాయిచింది.  బెల్లంపల్లి నుంచి ఈ సారి మాల  సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్​దక్కే ఛాన్స్​ఉండటంతో చెన్నూరు నుంచి మాదిగ లేదా నేతకాని సామాజిక వర్గానికి కేటాయిస్తారని భావిస్తున్నారు. ఆశావహులందరూ   పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తున్నారు.   చెన్నూరులో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్​ పెద్దలు ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్​ నేతలను, పార్టీని వీడి వెళ్లిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.  ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీని విడిచివెళ్లేందుకు సిద్దంగా ఉన్న లీడర్లు, క్యాడర్​ను గుర్తించి కాంగ్రెస్​ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.