
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో 42 రోజులుగా లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులు.. మరో 15 రోజులు రోడ్లపైనే ఉండనున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించడంతో ఈనెల 17 దాకా నిరంతరం విధులను కొనసాగించనున్నారు. రెడ్ జోన్స్ మినహా లాక్ డౌన్ సడలింపులు ఉన్న ఏరియాల్లో డ్యూటీ చేసే వారికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. దీంతో రోడ్లపైకి వచ్చే వెహికల్స్తో ట్రాఫిక్, ఇతర నేరాలను కంట్రోల్ చేయడంపై దృష్టిపెడుతున్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై పెద్దాఫీసర్లు ప్లాన్లు రెడీ చేశారు.
గ్రేటర్లోనే 20 వేల మంది
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి 63 వేల మందికి పైగా పోలీసులు రాష్ర్టంలో బందోబస్తులో ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 20 వేల మందికి పైగా డ్యూటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం మంది పోలీసులు చెక్ పోస్టులు, కంటెయిన్ మెంట్ జోన్లలో 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న జిల్లాల నుంచి అవసరాన్ని బట్టి ఇతర జిల్లాలకు సిబ్బందిని డిప్లాయ్ చేశారు. ఐతే రెండు ఫేజుల లాక్ డౌన్ లో సడలింపులు అంతగా లేకపోవడంతో పోలీసులకు అదనపు పనిభారం తప్పింది.
పోలీసులకు హెల్త్ బుక్ లెట్
రాష్ర్టంలో వివిధ పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బందికి వైరస్ సోకుతుండటంతో పెద్దాఫీసర్లు నివారణ చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ చెక్ పోస్టులు, రెడ్ జోన్స్, కంటెయిన్ మెంట్ ఏరియాల్లో డ్యూటీ చేస్తున్న సిబ్బంది హెల్త్ కండిషన్ పై ఫోకస్ పెట్టారు. సిబ్బంది కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు హెల్త్ బుక్ లెట్ ను డీజీపీ కార్యాలయం రూపొందించింది. అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ బుక్ లెట్ ను అందించనున్నారు.
బుక్లెట్లోని అంశాలివీ..
- 50 ఏండ్లు పైబడిన ఉద్యోగుల హెల్త్ కండీషన్ను బట్టి డ్యూటీ ఇవ్వాలి.
- శానిటైజర్ లేదా సోప్ తో చేతులు కడిగిన తర్వాతే స్టేషన్లోకి రానివ్వాలి
- ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలి.
- కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీ చేస్తుంటే పీపీఈ కిట్స్ వాడాలి.
కరోనా అనుమానిత వ్యక్తుల్ని చెక్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వ్యవహరించాలి. అవసరాన్ని బట్టి హెల్మెట్, స్టోన్ గార్డు అడ్డుపెట్టుకోవాలి. డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు తీసుకోవద్దు.