సిటీలో పెరిగిన టెంపరేచర్లు

సిటీలో పెరిగిన టెంపరేచర్లు
  • నగరం!.. సిటీలో పెరిగిన టెంపరేచర్లు
  • శివార్ల కన్నా 2.44 డిగ్రీలు ఎక్కువ  
  • వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణతోనే..
  • 47 లక్షల మందిపై పడిన హీట్ ఎఫెక్ట్​
  • ఎన్ఐటీ తిరుచ్చి ప్రొఫెసర్ల  స్టడీలో వెల్లడి
  • దశాబ్ద కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
  • బిల్డింగులు, రోడ్లు, పరిశ్రమలే కారణం

హైదరాబాద్​, వెలుగు :  సిటీలో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయని, ఉక్కపోత ఎక్కువవుతోందని, శివారు ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటుందని నగరవాసులు అనుకోవడం కామన్​అయిపోయింది. దీనికి కారణం ఉందని తమిళనాడులోని తిరుచ్చి నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​ టెక్నాలజీ (ఎన్​ఐటీ) ప్రొఫెసర్లు స్పష్టంచేశారు. గత దశాబ్దకాలంలో కోర్ సిటీ టెంపరేచర్లు 2.44 డిగ్రీలు పెరిగిందని తమ స్టడీలో తేల్చారు. సివిల్​ఇంజనీరింగ్​డిపార్ట్​మెంట్​చేసిన స్టడీలో  ఏటా 0.033 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుందని వెల్లడించారు.

ఎన్ ఐటీ ప్రొఫెసర్లు 2001–2021 కాలంలోని హీట్​ఎఫెక్ట్​పై స్టడీ చేశారు. హైదరాబాద్​లో వేగంగా విస్తరించే అర్బనైజేషన్ నే హీట్​పెరుగుదలకు ప్రధాన కారణమవుతోందని ప్రొఫెసర్లు పేర్కొన్నారు. కోర్ సిటీలో ఉష్ణోగ్రతలు పెరగడానికి బిల్డింగ్లు, రోడ్లు, పరిశ్రమలే ప్రధాన కారణమని తెలిపారు. పెరిగిన టెంపరేచర్లు సిటీ అర్బన్​ హీట్​ఐలాండ్​(యూహెచ్ఐ )గా మారుస్తుందని స్పష్టంచేశారు. శివారు ప్రాంతాలకన్నా ఎక్కువ టెంపరేచర్లు సిటీలో ఉండడాన్ని యూహెచ్ఐగా పరిగణిస్తారు. ప్రధానంగా ఇది మానవ కార్యకలాపాల ద్వారా జరుగుతుంది.

పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఎక్కువయ్యే నివాస ప్రాంతాలు, భవనాలు, విస్తరించే రోడ్లు, వాహనాల సంఖ్య తదితర మౌలిక వసతులతోనే ఒక సిటీ యూహెచ్ఐగా మారుతుందని తిరుచ్చి ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. సిటీలో నిర్మించే పెద్ద భవనాలు సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతలను గ్రహించి తిరిగి వదిలేయకపోవడంతోనే  అనూహ్యంగా టెంపరేచర్లు పెరిగిపోతాయని రాష్ట్ర పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు సీనియర్​సోషల్​సైంటిస్ట్​డబ్ల్యుజీ ప్రసన్న కుమార్​వివరించారు. 

ప్రభావిత ప్రాంతాలివే..

అంబర్​పేట, అమీర్​పేట్, ఆసిఫ్​నగర్, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్​నగర్, ఖైరతాబాద్​, కూకట్​పల్లి, మల్కాజ్​గిరి, మారేడ్​పల్లి, నాంపల్లి, షేక్​పేట్, ఉప్పల్​ప్రాంతాల్లో అధికంగా ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండే18 లక్షల మందిపై హీట్ ఎఫెక్ట్ పడుతుంది. కాగా మరో 29 లక్షల మందిపై పాక్షికంగా ఎఫెక్ట్ చూపుతుంది. అంటే మొత్త్ం 47 లక్షల మంది సిటిజన్లపై అధిక టెంపరేచర్ల  ప్రభావం ఉంటుంది. 

ఎల్ఎస్​టీ ఎక్కువగా ఉంటే.. 

యూహెచ్ఐ పెరుగుదలతో ల్యాండ్​సర్ఫేస్​టెంపరేచర్లు (ఎల్ఎస్ టీ–భూ ఉపరితల ఉష్ణోగ్రతలు) పెరిగేందుకు కారణమవుతున్నాయని ఎన్​ఐటీ స్టడీలో తేలింది. సూర్యరష్మి వల్ల ఒక ప్రాంతంలోని నేల, నీళ్లు, గ్రీనరీ, రోడ్లు, బిల్డింగ్ల టెంపరేచర్లు పెరగడాన్నే ఎల్ఎస్​టీగా భావిస్తారు. ఎల్ఎస్ టీ ఎక్కువగా ఉంటే ఎయిర్​టెంపరేచర్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల హీట్​మ్యాపులను తయారు చేసి వ్యత్యాసాన్ని లెక్కగట్టడం ద్వారా పెరిగిన టెంపరేచర్లను గుర్తిస్తారని అంటున్నారు. 

పరిష్కారం ఏమిటీ? 

అర్బనైజేషన్​తో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడం ద్వారానే పెరిగే ఉష్ణోగ్రతలను అరికట్టవచ్చని ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. యూహెచ్ఐ హాట్​స్పాట్​లను గుర్తించి క్రమం తప్పకుండా హీట్​మ్యాప్​లను తయారు చేయాలంటున్నారు. ఆయా ప్రాంతాల టెంపరేచర్లు, ఎయిర్​క్వాలిటీని లెక్కగట్టి వాటిని ఎలా అదుపులోకి తేవాలో గుర్తించాలంటున్నారు. సిటీల మాస్టర్​ప్లాన్​అమలు చేయడం, అర్బన్​ నిబంధనలు కఠినంగా పాటించడం, గ్రీనరీ పెంచడం, అర్బన్​ ట్రాన్స్​పోర్టేషన్ పెంచడం ముఖ్యమైన పరిష్కార మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. కూల్ రూఫ్స్, కూల్ పేవ్​మెంట్స్​కూడా టెంపరేచర్లు తగ్గడానికి దోహదం చేస్తాయని అంటున్నారు.  

అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వొద్దు

సిటీలోని బిల్డింగ్లు ఉష్ణోగ్రతలను గ్రహించి తిరిగి వదిలి పెట్టవు. దాంతో  టెంపరేచర్లు పెరుగుతాయి. అర్బన్​ ఏరియాలో బిల్డింగ్​లు అధికంగా ఉంటాయి. రూరల్​ ఏరియాలో వీటి సంఖ్య తక్కువ. గ్రీనరీ ఉంటుంది. సిటీలో ఉండాల్సినంత గ్రీనరీ లేదు. ఓయూ, అగ్రికల్చర్​, సెంట్రల్​వర్సిటీల వద్ద ఏ సీజన్​లో చూసినా  మిగతా ప్రాంతాల కన్నా రెండు డిగ్రీల టెంపరేచర్​ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం అక్కడ ఉన్న గ్రీనరీనే. టెంపరేచర్లు తగ్గాలంటే బిల్డింగ్లకు అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వొద్దు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాటిని గ్రీన్​ బిల్డింగ్ లుగా మార్చుకోవాలి. అర్బన్​ హీట్​కు మోటార్​వాహనాల కాలుష్యం కూడా కారణం. అందుకే ట్రైన్​వ్యవస్థను పెంచుకోవాలి. 

– ప్రసన్నకుమార్​, సీనియర్ ​సోషల్  ​సైంటిస్ట్​, స్టేట్ ​పొల్యూషన్​ కంట్రోల్ బోర్డ్