పాత కార్ల రేట్లూ పెరిగినయ్​

పాత కార్ల రేట్లూ పెరిగినయ్​
  • సప్లయ్​ తగ్గడమే కారణం

వెలుగు బిజినెస్​ డెస్క్​: పాత కారు కొనాలనుకుంటున్నారా ?  ఇప్పుడు గతంలో కంటే కొంచెం ఎక్కువ రేటే పెట్టాల్సి ఉంటుంది, రెడీ అవండి.  కరోనా మహమ్మారి రాకతో సొంత వెహికల్​ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు జీతాల కోతతోపాటు, కొంత మందికి ఉద్యోగాలే పోవడంతో ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరయింది. దీంతో 2020–21 ఫైనాన్షియల్​ ఇయర్లో కొత్త కార్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 27 శాతం పడిపోయాయి. డీలర్​షిప్స్​ వద్ద రిజిస్ట్రేషన్స్​ డేటా దీనిని వెల్లడిస్తోంది.

సేల్స్​ ఏటా 15 శాతం పెరుగుతున్నాయ్​..
2021–22 ఫైనాన్షియల్​ ఇయర్లో పాత కార్ల అమ్మకాలు కొంచెం అటూ ఇటూగా 40 నుంచి 45 లక్షల లెవెల్​లో ఉంటాయని క్రిసిల్​ చెబుతోంది. కిందటి ఫైనాన్షియల్​ ఇయర్ మొదటి క్వార్టర్లో అమ్మకాలు చెప్పుకోదగ్గ రీతిలో లేవు. ఎందుకంటే దేశమంతటా కచ్చితమైన లాక్​డౌన్​ అమలులో ఉంది. కరోనా మహమ్మారి కంటే ముందు నుంచే పాత కార్ల అమ్మకాలు మన దేశంలో జోరందుకున్నాయి. పాత కార్ల సేల్స్​ ఏటా 15 శాతం చొప్పున పెరుగుతున్నాయని, 2024 నాటికి ఈ అమ్మకాలు ఏకంగా 49 బిలియన్​ డాలర్లకు చేరతాయని నోమురా అంచనా వేస్తోంది. ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త వాటి కంటే పాత కార్ల వైపే ఎక్కువ మంది ఇప్పుడు చూస్తున్నారు.

సప్లయ్​ చాలట్లే..
కొత్త కార్లు కొనే వారి సంఖ్య తగ్గడంతో డిమాండ్​కి తగినన్ని పాత కార్లు మార్కెట్లో లేవు. ఫలితంగా రూ. 4 లక్షల లోపు పాత కార్ల రేట్లు కిందటి ఫైనాన్షియల్​ ఇయర్లో సగటున 10 శాతం పెరిగాయి. సెకండ్​  హాండ్​ మార్కెట్లో ఈ సెగ్మెంట్లోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని ఇక్రా లిమిటెడ్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆశిష్​ మోదాని చెప్పారు. 2020–21లో కొత్త వెహికల్స్​ అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో మార్కెట్లోకి వచ్చే పాత కార్ల సంఖ్యా తగ్గిపోయింది. కిందటేడాది ఎక్స్చేంజ్​లు కూడా బాగా తగ్గాయి. దీంతో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే పర్సనల్​ మొబిలిటీనే ఇష్టపడే వారు పాత కార్లపై దృష్టి పెడుతున్నారని మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​ వీల్స్​ సీఈఓ అశుతోష్​ పాండే తెలిపారు. 

ఎంట్రీ లెవెల్​ హ్యాచ్​బాక్స్ కోరుకుంటున్నారు..
పాత కార్లను కొనాలనుకునే వాళ్లలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్​ హ్యాచ్​బాక్స్​ను ఇష్టపడుతున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్​, డిజైర్​, వేగన్​ ఆర్​, బాలెనో మోడల్స్​ను, హ్యుండాయ్​ ఐ–20, ఐ–10. మహీంద్రా స్కార్పియో మోడల్స్​ వైపు మొగ్గుచూపుతున్నారని ఓఎల్​ఎక్స్​, మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​లు వెల్లడిస్తున్నాయి. గత అయిదారేళ్లలో చూస్తే ఈ ఏడాది గ్రోత్​ చాలా బాగుందని కార్​వాలే శర్మ తెలిపారు. కోవిడ్​కు ముందు కంటే ఇప్పుడు అమ్మకాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు.  అంతకు ముందు ఏడాదితో పోలిస్తే డిమాండ్​ 30 శాతం పెరిగిందన్నారు. కిందటి ఫైనాన్షియల్​ ఇయర్​ చివరి క్వార్టర్లో తమ ప్లాట్​ఫామ్​ చూసే వారి సంఖ్య 48 శాతం పెరిగిందని వెల్లడించారు.

ఎక్కువ అన్​ ఆర్గనైజ్డే..
పాత కార్ల మార్కెట్​ ఇంకా అన్​ ఆర్గనైజ్డ్​గానే ఉందని చెప్పుకోవచ్చు. టైర్​ 1, టైర్ 2 సిటీలలోని కస్టమర్లు ఎక్కువగా ఆన్​లైన్​ పోర్టల్స్​పై ఆధారపడుతుండగా, మరోవైపు చిన్న పట్టణాలలోని వారు మాత్రం లోకల్​ డీలర్స్​పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ఇంటర్​నెట్​ వినియోగం ఈ ట్రెండ్స్​ను మారుస్తోంది. ఆర్గనైజ్డ్​ ఛానెల్స్​ ద్వారా ట్రాన్సాక్షన్లు గత పదేళ్లలో రెట్టింపవడమే దీనికి నిదర్శనమని నోమురా చెబుతోంది. రాబోయే ఏళ్లలో ఆర్గనైజ్డ్​ మార్కెట్​ వాటా మరింత పెరుగుతుందని మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​ భావిస్తోంది.  ఎందుకంటే, పాత కార్లు అమ్మడానికి, కొనడానికి ట్రాన్స్​పరెంట్​ ఎక్స్​పీరియన్స్​ను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. కొత్త కార్ల సేల్స్​ పెరుగుతున్నాయంటే, పాత వాటి అమ్మకాలు కూడా పెరుగుతాయి. కొత్త కార్ల అమ్మకాలు పుంజుకుంటే కొంతయినా, సెకండ్​ హ్యాండ్​ మార్కెట్లో సప్లయ్​ కొరత తీరుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.   

కరోనాతో సొంత కారంటే పెరిగిన ఇష్టం..
డిమాండ్​ 133 శాతం పెరిగితే, సప్లయ్​ మాత్రం 120 శాతమేనని ఓఎల్​ఎక్స్​ ఆటో (నాస్పర్స్)  సీఈఓ అమిత్​ కుమార్​ చెబుతున్నారు. సప్లయ్​లో 18 నుంచి 20 శాతం షార్టేజ్​ ఉందని కార్​వాలే సీఈఓ బన్వరి లాల్​ శర్మ తెలిపారు.  పాత కారు కొనాలనుకునే కొంత మంది నిర్ణయాలను కూడా కరోనా మహమ్మారి ప్రభావితం చేసింది.  కోవిడ్​–19 కారణంగా సొంత వెహికల్​ కొనాలనుకుంటున్నట్లు 65 శాతం మంది తమ సర్వేలో వెల్లడించినట్లు ఇండియన్​బ్లూబుక్​ తెలిపింది. అంతేకాదు, కరోనాకి భయపడకపోతే కారు కొనేవాళ్లమే కాదని పాత కార్లను కొన్న వారిలో 29 శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే పేర్కొంది. 

ఎంక్వైరీల జోరు..
పాత కార్ల అమ్మకాల మార్కెట్లో 80 శాతం వాటా ఉందని చెప్పుకుంటున్న ఓఎల్​ఎక్స్​ సేల్స్​ ఏకంగా 130 శాతం పెరిగాయి. లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే రూరల్​ ఏరియాల నుంచి డిమాండ్​ జోరందుకుందని, ఆ తర్వాతే అర్బన్​ ఏరియాల నుంచి డిమాండ్​ పెరిగిందని కుమార్​ చెప్పారు.  ఏదైనా కారు అమ్మకానికి ఉందని పోస్ట్​ చేస్తే గతంలో వచ్చే రిప్లయ్​ల కంటే ఇప్పుడు రిప్లయ్​లు ఎక్కువయ్యాయని కూడా ఓఎల్​ఎక్స్​ ఆటో చెబుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఈ సేల్స్​ రెట్టింపయినట్లు మరో కంపెనీ స్పిన్నీ వెల్లడించింది. ఈ కంపెనీ ఇటీవలే 65 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ తెచ్చుకుంది. సెకండ్​ హ్యాండ్​ లగ్జరీ కార్ల సేల్స్​ కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్ల డిమాండ్​ 45 శాతం దాకా ఎక్కువైందని బిగ్​ బాయ్​ టాయ్జ్​ చెబుతోంది. దీంతో సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​పైనా దృష్టి పెడుతున్నాయి ఆటోమొబైల్​ కంపెనీలు.  2021 ఫైనాన్షియల్​ ఇయర్లో తమ సేల్స్​ రెవెన్యూ 20% పెరిగిందని మహీంద్రా ఫస్ట్​ చాయిస్​ తెలిపింది. కిందటి ఏడాది  కొత్తగా 200 స్టోర్లను కంపెనీ తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 1,150 కి చేరింది.