
మంజూరైన రెండేళ్లకు టెండర్లు పూర్తి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ్ నగర్ రైల్వే గేట్ వద్ద నిర్మించే ఆర్వోబీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. రేపో మాపో నిర్మాణ పనులు మొదలుకానున్నాయని తెలుస్తోంది.
దశాబ్దాల కల..
నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులో మాధవనగర్ మీదుగా రైల్వే లైన్ వెళుతోంది. ఇదే దారిలో హైదరాబాద్, నాందేడ్ హైవే ఉండడంతో అక్కడ రైల్వే గేట్ ఏర్పాటు చేశారు. 1973లో రైల్వే లైన్ వద్ద రోడ్డుఓవర్ బ్రిడ్జి డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ1989లో అప్పటి ఎంపీలు ఎన్నో సార్లు పార్లమెంట్లో ప్రస్తావించినా సాంక్షన్ కాలేదు. చివరకు 2019లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవతో ఆర్వోబీ పనులకు మంజూరు లభించింది. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2020లో ఫైనాన్స్ క్లియరెన్స్తో పాటు పాలన అనుమతులను ఇచ్చింది. ఆర్వోబీకి రూ.93.12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇందులో కేంద్రం వాటా కింద రూ.30.05 కోట్లను రిలీజ్ చేసింది. రాష్ట్ర సర్కార్ వాటాగా రూ.63.07 కోట్లు భరించాల్సి ఉంది.
రెండేళ్ల తర్వాత...
2020 లో ఆర్వోబీ మంజూరైనా ఆరు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకుండా తాత్సారం చేసింది. దీంతో ఎంపీ అర్వింద్ ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఫలితంగా 2021 జనవరిలో ఆర్అండ్బీను ఆఫీసర్లు డీపీఆర్ నివేదికను సర్కార్కు అందజేశారు. డీపీఆర్ను ఆమోదించిన ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసినా అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది.
పెరగనున్న బడ్జెట్..
మాధవ నగర్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి 2020లో కేంద్రం రూ.90 కోట్లు అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర వాటా రూ.63.07 కోట్లు. అయితే రెండేళ్ల కింద కేంద్రం వాటా రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడంలో ఆలస్యం చేసింది. దీంతో నిర్మాణం డిలే కావడంతో అంచనా వ్యయం మరో రూ.18 కోట్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్లో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరిగిందని ఆదిశక్తి కాంట్రాక్ట్ సంస్థ ఆ అగ్రిమెంట్ను క్యాన్సల్చేసింది. ఇలాంటి తప్పిదాలు మాధవనగర్ ఆర్వోబీపై పడకండా చూడాలని, నిర్మాణ పనుల్లో జాప్యం చేయొద్దని ప్రజలు కోరుతున్నారు.
గేట్ గండం..
సికింద్రాబాద్ నుంచి ముంబాయి, ఆజ్మీర్, ఓకా, రామేశ్వరం వైపు వెళ్లే రైళ్లు నిజామాబాద్ రైల్వే లైన్ మీదుగా వెళ్తాయి. బ్రాడ్ గేజ్ రైల్వే లైన్తో ఈ రూట్లో రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇరవై ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ షటిల్ రైల్వే సర్వీస్లతో పాటు ఇరవై గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. వీక్లీ సర్వీసులు అదనంగా నడుస్తాయి. డిచ్పల్లి, నిజామాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య మాధవనగర్ వద్ద రైల్వే గేట్ ఉంది. ప్రతి అరగంటకోసారి రైల్ రావడంతో గేట్ వేస్తారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కు వెళ్లే అంబులెన్స్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సార్లు ట్రీట్మెంట్ ఆలస్యమై ప్రాణాలు కొల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఆర్వోబీ పూర్తయితే గేట్ గండంకు చెక్ పడనుంది.