
పెర్త్: టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియా క్రికెటర్ల సెక్యూరిటీ, వారి ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారింది. పెర్త్లో విరాట్ కోహ్లీ హోటల్ రూమ్లోకి వెళ్లిన ఓ అభిమాని.. గది మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టాడు. ‘కింగ్ కోహ్లీ హోటల్ రూమ్’ అనే టైటిల్తో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో ఇండియా ప్లేయర్ వస్తువులు, జెర్సీలు, బుక్స్, షూస్ చూపించాడు. విషయం తెలుసుకున్న విరాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది తన ప్రైవసీపై దాడి అన్నాడు. వీడియోను రీషేర్ చేసిన కోహ్లీ.. ఇలాంటి అతి అభిమానం మంచిది కాదన్నాడు. ‘తమ ఫేవరెట్ ప్లేయర్లను చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఉత్సాహం చూపిస్తారని తెలుసు. దాన్ని నేను అభినందిస్తా. కానీ, ఈ వీడియో చూశాక నా ప్రైవసీ గురించి భయం కలుగుతోంది. నేనున్న హోటల్ రూమ్లోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇంక ఎక్కడ ఉంటుంది? ఈ రకమైన మూర్ఖపు అభిమానాన్ని నేను అస్సలు ఒప్పుకోను. ఇది నా ప్రైవసీపై దాడి చేయడమే. దయచేసి వ్యక్తుల గోప్యతను గౌరవించండి. దాన్ని వినోద సరుకుగా మార్చవద్దు’ అని విరాట్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ కోసం పెర్త్ వచ్చిన ఇండియా ‘క్రౌన్ రిసార్ట్’లో ఉంది. హోటల్ స్టాఫ్ ఇద్దరు కోహ్లీ రూమ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనపై క్షమాపణ కోరిన హోటల్.. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.