
- హోమ్ లోన్ల బకాయిలు రూ. 17.7 లక్షల కోట్లకు
దేశంలోని మెజార్టీ కుటుంబాల అప్పుల్లో హోమ్ లోన్ల వాటానే ఎక్కువగా ఉంది. ఇంకా క్రెడిట్ కార్డు అప్పులు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై ముగిసే నాటికి దేశంలో క్రెడిట్ కార్డుల అవుట్ స్టాండింగ్ (ఇంకా అప్పు తీర్చని) బకాయిల విలువ రూ. 1.6 లక్షల కోట్లకు పెరిగింది. కిందటేడాది జులై నాటికి ఈ వాల్యూ రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంది. అదే హోమ్ లోన్ కింద ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్ల విలువ రూ. 17.7 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలో ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన హోమ్ లోన్ల విలువలో బ్యాంకులు ఇచ్చిన హోమ్ లోన్ల వాటా 14 శాతం నుంచి 14.34 శాతానికి (ఏడాది ప్రాతిపదికన) పెరిగింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు విలీనం పూర్తయ్యాక హోమ్ లోన్ సెగ్మెంట్లో బ్యాంకుల వాటా రూ. 21 లక్షల కోట్లకు పెరుగుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, బ్యాంకులు ఇచ్చే లోన్లు విలువ ఈ ఏడాది జులై 29 నాటికి రూ. 123.69 లక్షల కోట్లకు చేరుకుంది.
బ్యాంకుల వద్ద డిపాజిట్లు...
ఇది ఏడాది ప్రాతిపదికన చూస్తే 14.52 శాతం ఎక్కువ. అలానే బ్యాంకుల వద్ద డిపాజిట్లు కూడా 9.14 శాతం పెరిగి రూ. 169.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు పర్సనల్ లోన్ సెగ్మెంట్ పుంజుకుంటుండడాన్ని చూస్తుంటే ఎకానమీలో వినియోగం ఊపందుకున్నట్టు తెలుస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. కరోనా వలన తగ్గిన కన్జూమర్ల వినియోగం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటోందని వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1 లో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతంగా రికార్డయిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కన్జంప్షన్ (ప్రజలు, ప్రైవేట్ సెక్టార్ చేసే ఖర్చులు) ఏడాది కాలంలో 28 శాతం పెరిగిందని, కన్జూమర్ లోన్లు (ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు వంటివి కొనుక్కోవడానికి చేసే లోన్లు) ఈ ఏడాది మార్చి నాటికి 16.5 శాతం పెరిగాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు వ్యతిరేకంగా ఇచ్చే లోన్ల వాటా ఇదే టైమ్లో 11.8 శాతం ఎగిసింది. మరోవైపు కంపెనీలకు ఇచ్చే లోన్లు మాత్రం పెద్దగా పెరగలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. జ్యువెలరీ, టెలికం, ఇంజినీరింగ్, వంట నూనె సెక్టార్లలో కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో లోన్లు ఇవ్వడం ఊపందుకుందని వివరించింది.
వడ్డీ పెరిగినా హోమ్ లోన్లకు డిమాండ్ తగ్గలే..
ఒక వైపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతున్నా దేశంలో హోమ్ లోన్లకు డిమాండ్ తగ్గడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగుండడంతో హోమ్ లోన్లకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించారు. ఆర్బీఐ గత మూడు మానిటరీ పాలసీలలో రెపో రేటును 1.4 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ బెంచ్మార్క్ వడ్డీ రేటు 5.4 శాతానికి చేరుకుంది. ఫలితంగా రెపో రేటుతో లింక్ అయి ఉన్న లోన్లు ఖరీదుగా మారాయి. వీటి ఈఎంఐలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హోమ్ లోన్ల ఈఎంఐలు ఖరీదుగా మారాయి. అయినప్పటికీ బ్యాంకులు ఇస్తున్న లోన్లు పెరుగుతూనే ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
వర్షాలు బాగుంటే హోమ్ లోన్లకు డిమాండ్..
వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలయిన పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హర్యానా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఈసారి వర్షాలు బాగా పడ్డాయని శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ రవి సుబ్రమణియన్ అన్నారు. వర్షాలు బాగా పడితే రూరల్ ప్రాంతాల్లోని ప్రజల ఆదాయాలు పెరుగుతాయని చెప్పారు. ఫలితంగా ఇల్లు వంటి అత్యవసరాలకు డిమాండ్ క్రియేట్ అవుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్న టౌన్లలో డిమాండ్ పెరుగుతోందని వివరించారు. దేశంలో 58 శాతం మంది జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, గత నాలుగేళ్ల నుంచి వర్షాకాలం బాగుండడంతో రూరల్ ఎకానమీలో డిమాండ్ ఊపందుకుంటోందని వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ‘అందరికి ఇల్లు’ ఇనీషియేటివ్ ద్వారా అఫోర్డబుల్ ఇండ్లకు డిమాండ్ పెరుగుతోందని, ఫలితంగా అఫోర్డబుల్ హోమ్ లోన్లకు గిరాకీ పెరిగిందని రవి సుబ్రమణియన్ అన్నారు. ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, కరోనా లాక్డౌన్లో తిరిగి గ్రామాలకు వలసలు జరగడం వలన గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో అనేక అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లు నెలకొంటున్నాయని వివరించారు. వ్యవసాయ రంగ ఆధారిత ఎకానమీపై వర్షాకాల ప్రభావం ఎప్పుడూ ఉంటోందని జేఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ ఎండీ మనీష్ షేత్ అన్నారు. ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువ పడడంతో ఎకానమీలో సెంటిమెంట్ మెరుగుపడుతుందని పేర్కొన్నారు.