హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన పీజీ సీట్ల బ్లాకింగ్ వ్యవహారం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కౌన్సెలింగ్ ప్రాసెస్లో ఉన్న లోపాలను గుర్తించి, కొత్త పద్ధతి రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. కాళోజీ వర్సిటీ రిజిస్ర్టార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, ఇద్దరు మెడికల్ ప్రొఫెసర్లు, ఇద్దరు లీగల్ అడ్వైజర్లతో కమిటీని ప్రతిపాదించారు. సీట్ల బ్లాకింగ్, స్లైడింగ్, రిజర్వేషన్ల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులపై ఈ కమిటీ ఫోకస్ చేయనుంది. గతంలో స్టూడెంట్లు వేసిన కోర్టు కేసులు, తీర్పులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కౌన్సెలింగ్ ప్రొసీజర్పై చర్చించి, ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ రీసెర్చ్ కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా, ఇక్కడ రీసెర్చ్లు చేయకపోవడంతో అవి అలాగే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ రీసెర్చ్ కోసం కూడా ఓ విధానాన్ని రూపొందించాలని సర్కార్ నిర్ణయించింది. కమిటీలో ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, గచ్చిబౌలి టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ కూడా ఉన్నారు.