ఉన్నతాధికారులకు పాక్ సివిలియన్ కంప్లైంట్
ఇస్లామాబాద్: తన బైక్ ఎవరో ఎత్తుకెళ్లిపోయారని ఎనిమిదేండ్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి.. ఆ బైక్ను పోలీసులే వాడుతున్నారని తెలిసి షాక్ తిన్నాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇమ్రాన్అనే వ్యక్తికి చెందిన హోండా సీడీ70 బైక్.. లాహోర్లోని మొఘల్పుర ప్రాంతం నుంచి ఎవరో దొంగిలించారు. దీనిపై ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై ఇమ్రాన్ పలుమార్లు పోలీసులను కలిసి బైక్ గురించి ఆరా తీస్తే.. దొరుకుతుందిలే అనే సమాధానమే తప్ప.. బైక్ను మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇలా ఎనిమిదేండ్లయ్యాక ఈ మధ్యే అతని బైక్ మీద పెనాల్టీ పడిందంటూ ఈ–చలాన్ ఇమ్రాన్ ఇంటి అడ్రస్కు వచ్చింది. అందులో చూస్తే పోలీసులే తన బండి నడుపుతూ రూల్స్ క్రాస్ చేసినట్లు కనిపించడంతో ఇమ్రాన్ ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం పోలీసులే తన బైక్ వాడుతున్నారని తెలిసి చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్కు కంప్లైంట్ చేశాడు. కాగా, బైక్ల మీద ఈ చలాన్లు వేసుడు పాక్లో చట్టవిరుద్ధమని లాహోర్ హైకోర్టు మరోకేసులో కిందటి బుధవారం తీర్పునిచ్చింది. ఈ చలాన్లు విధించే సిస్టమే ప్రభుత్వం సక్కగ ప్రవేశపెట్టలేదని, పోలీసులు బైకర్లమీద చలాన్లు విధుంచడమేంటని ప్రశ్నించింది.
మరిన్ని వార్తల కోసం...