- హార్దిక్ రీ ఎంట్రీ సంతోషాన్నిచ్చింది: ద్రవిడ్
- రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్
న్యూఢిల్లీ:ఐపీఎల్లో కెప్టెన్లుగా ఇండియన్ ప్లేయర్లు సక్సెస్ కావడం టీమిండియాకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లుగా మరింత ఎదగడానికి నాయకత్వం దోహదపడుతుందన్నాడు. సౌతాఫ్రికాతో గురువారం తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ‘చాలా మంది ఇండియన్ కెప్లెన్లు ఐపీఎల్లో రాణించారు. సూపర్ సక్సెస్ సాధించారు. అందులో హార్దిక్ కూడా ఒకడు. తను చాలా తెలివైనవాడు. కేఎల్ రాహుల్.. లక్నోను, శాంసన్.. రాయల్స్ను బాగా నడిపించారు. కోల్కతాకు కూడా శ్రేయస్ మంచి సేవలందించాడు. యంగ్ బ్యాటర్లు టీమ్ నడిపించడం శుభపరిణామం. దీనివల్ల వ్యక్తులుగా ఉన్న వాళ్లు గొప్ప ప్లేయర్లుగా ఎదుగుతారు ’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా తిరిగి టీమ్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని ద్రవిడ్ వెల్లడించాడు. ‘పాండ్యా టీమ్లోకి రావడం చాలా గొప్ప విషయం. అత్యుత్తమ ఆల్రౌండర్ అతను. బ్యాట్, బాల్తో అద్భుతాలు చేస్తాడు. ఐపీఎల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. కాబట్టి అతని పూర్తి సామర్థ్యాలను మేం ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. పాండ్యా బౌలింగ్ చేస్తుండటం టీమిండియాకు చాలా బలం’ అని ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
రోహిత్కు బ్రేక్ సరైందే..
అన్నిసార్లు.. ప్రతి ప్లేయర్ టీమ్కు అందుబాటులో ఉండాలనుకోవడం సరైంది కాదని ద్రవిడ్ అన్నాడు. రోహిత్ మూడు ఫార్మాట్ల ప్లేయర్ కాబట్టే విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. తనని ఫిట్గా, ఫ్రెష్గా ఉంచడం తమ బాధ్యతన్నాడు. ఇక, యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని, అతను చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ఈ సిరీస్లో అతనికి తుది జట్టులో చాన్స్పై ద్రవిడ్ భరోసా ఇవ్వడం లేదు.
హార్దిక్పైనే ఫోకస్
ఒక రోజు ఆలస్యంగా టీమిండియాతో చేరిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా... మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పర్యవేక్షణలో 20 నిమిషాల పాటు పాండ్యా బౌలింగ్ చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్లో హార్దిక్ ఆల్రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్కు కప్ అందించాడు. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్లో తనపైనే ఎక్కువగా ఫోకస్ కనిపిస్తోంది.
హాట్ కేకుల్లా తొలి టీ20 టిక్కెట్లు..
తొలి టీ20కి సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. 2019 తర్వాత ఢిల్లీలో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో అందుబాటులో ఉంచిన 27 వేల టిక్కెట్లు మొత్తం అయిపోయాయని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రజన్ మన్చందా వెల్లడించారు.