- ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు
- రెండు మూడు రోజుల్లో లెక్క తేల్చి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే చాన్స్
- నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెట్టించాలని నిర్ణయం
- తప్పు ఎవరు చేసినా పబ్లిక్ కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పిన సీఎం
హైదరాబాద్, వెలుగు: డ్యామేజీ అయిన కాళేశ్వరం రిజర్వాయర్లకు రిపేర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని రికమండేషన్స్ ఆధారంగా రిపేర్లు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. రిపేర్ల కోసం ఎంత ఖర్చు అవుతుందో లెక్క గట్టాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ రికమండేషన్స్ ఏమున్నాయి? ఎవరెవరు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది ? దేనికెంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు, మూడు రోజుల్లో రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలని ఇరిగేషన్ ఆఫీసర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థతోనే పెట్టించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యంతో తప్పు జరిగినప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోణంలో ఉంటాయే తప్ప పొలిటిల్ ఇష్యూస్తో ముడిపడి ఉండవని, అధికారులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఎన్డీఎస్ఏ రికమండేషన్స్ ఆధారంగా వీలైనంత త్వరగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రభుత్వం రిపేర్లు చేయాలనుకుంటున్నది.
రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థకే
కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్లో సమస్యలు తలెత్తాయని ఎన్డీఎస్ఏ తెలిపింది. అంటే 2019లో డ్యామేజీ జరిగింది. వాటిని అప్పుడే గుర్తించి రిపేర్లు చేపట్టి ఉంటేం మిగతా పిల్లర్లకు సమస్యలు వచ్చేవి కాదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థే తీసుకోవాల్సి ఉంటుంది. రిపేర్లకు సంబంధించిన ఖర్చుల అంశాన్ని కూడా ఎన్డీఎస్ఏ సిఫార్సుల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థతో చర్చించింది. అవసరమైన ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పగా.. అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రికమండేషన్స్ రావడంతో.. వాటికి తగ్గట్టుగా రిపేర్లు చేయనున్నారు. ఇందుకోసం ఎవరెవరు, ఎక్కడ, ఏమి పనిచేయాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. ఎంతవరకు రిపేర్లు చేయగలరు ? చేసిన తర్వాత కూడా మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఎలా అనే దానిపైనా ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి నివేదించనుంది. కాగా, మాన్సూన్ త్వరగా వస్తే అంత తొందరగా పనులు పూర్తి చేయగలమా అన్న సందేహాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. మాన్సూన్కు ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో.. టైం బాండ్ పెట్టుకుని ఎంతవరకు అయితే అంత వరకు పనులు కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారు. ఇక, మాన్సూన్తో సంబంధం లేకుండా చేసే రిపేర్లు ఏమున్నాయో వాటిని గుర్తించి పనులు చేపట్టనున్నారు. ఒక్క బ్యారేజీ తర్వాత ఒక్కటి కాకుండా.. మూడింటిలో ఉన్న డ్యామేజీలకు ఒకేసారి రిపేర్లు మొదలుపెట్టాలని భావిస్తున్నారు.