క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్–2026 షెడ్యూల్ను మంగళవారం (నవంబర్ 25) రిలీజ్ చేసింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా టోర్నీలో 20 జట్లు తొలిసారి తలపడుతున్నాయి. టోర్నీ ఇండియాలో జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. పాకిస్థాన్ తో తప్ప ఇండియా తమ మ్యాచ్ లన్నీ హోమ్ గ్రౌండ్ లోనే ఆడుతుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. 20 జట్లు ఆడుతుండడంతో ఈ టోర్నీ ఫార్మాట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. గ్రూప్–బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్.. గ్రూప్–సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.. గ్రూప్–డిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ ఉన్నాయి. ఐదు జట్లు నాలుగు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్ లో ఒక్కో జట్టు మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లో మొత్తం 8 జట్లు నాలుగు జట్లుగా రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి.
ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. నాలుగు జట్లలో టాప్-2 లో ఉన్న జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. మార్చి 4న జరిగే తొలి సెమీస్కు కోల్కతా లేదా కొలంబో ఆతిథ్యమివ్వనుంది. 5న రెండో సెమీస్ ముంబైలో జరుగుతుంది. 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మెగా టోర్నీకి హిట్మ్యాన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. ఇండియాలో ఐదు వేదికలు (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు (క్యాండీ, కొలంబోలో రెండు) వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
2026 టీ20 వరల్డ్ కప్ లో నాలుగు గ్రూప్ లు:
గ్రూప్–ఎ: ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్–బి: శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
గ్రూప్–సి: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
గ్రూప్–డి: న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ ఉన్నాయి.
ఇండియాలో వేదికలు:
అహ్మదాబాద్,ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై
శ్రీలంకలో వేదికలు:
క్యాండీ, కొలంబో (సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, ఆర్. ప్రేమదాస స్టేడియం)
